Will Jagan support CEC impeachment motion : జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే.. ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తక్షణమే మద్దతు ప్రకటించాలని ఏపీ పీసీసీ చీఫ్  వైఎస్ షర్మిల సవాల్ చేశారు.  గత ఎన్నికల్లో ఈవీఎంలు మారిపోయాయని,  ఓట్లు గల్లంతయ్యాయని జగన్ చేసిన ఆరోపణలు నిజమే అయితే, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఎన్నికల కమీషన్‌ను నిలదీసే అవకాశం వచ్చిందని ఆమె అంటున్నారు.  షర్మిల విసిరిన సవాల్ జగన్‌ను రాజకీయంగా ఇరకాటంలో నెట్టింది. 

షర్మిల సూటి సవాల్ – జగన్ స్పందన ఏది? 

గత ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జగన్ మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే.. ఇప్పుడు దాన్ని నిరూపించే సమయం వచ్చింది  అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల కమీషన్ పనితీరుపై నమ్మకం లేనప్పుడు, ఆ వ్యవస్థకు బాధ్యుడైన ప్రధానాధికారిపై విపక్షాలు తెచ్చిన అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా జగన్ ఎందుకు వెనకాడుతున్నారనేది చాలా మందికి వచ్చే సందేహం. ఇది కేవలం సవాల్ మాత్రమే కాదు, జగన్ చిత్తశుద్ధిని తేల్చే ఒక గీటురాయిగా మారింది.

వైసీపీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు 

వైసీపీ తీరును గమనిస్తే ఇక్కడ ఒక స్పష్టమైన  తేడా  కనిపిస్తుంది. ఓట్ల పోలింగ్ లో తేడాలని.. ఈవీఎంలపై నమ్మకం లేదని జగన్ అంటున్నారు. ఇలాంటి సమయంలో  పార్లమెంట్ వేదికగా అదే ఈసీని నిలదీసే అవకాశం వచ్చినప్పుడు మౌనం వహించడం ఏ రకమైన పోరాటమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఫలితాల్లో అక్రమాలు జరిగాయని నమ్మితే, ఇండియా కూటమితో కలిసి ఈ పోరాటంలో భాగస్వామి కావాలి. అలా కాకుండా మౌనంగా ఉంటే, ఆయన చేస్తున్న పోరాటమంతా కేవలం కార్యకర్తలను బుజ్జగించడానికి చేస్తున్న డ్రామా అనే ముద్ర పడే ప్రమాదం ఉంది.

వైసీపీకి ఇది లిట్మస్ టెస్ట్ 

ఈ అభిశంసన తీర్మానం వైసీపీకి ఒక రకమైన విషమ పరీక్ష. ఒకవేళ తీర్మానానికి మద్దతు ఇస్తే, కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే.. ఈవీఎంలపై తను చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని జగన్ స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుంది. అంటే, అటు కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి, ఇటు తన ఓటమికి ఈవీఎంలే కారణమనే తన పాత వాదనను కూడా కాపాడుకోవాలి. ఈ రెండింటి మధ్య జగన్ రెడ్డి ఏ దారి ఎంచుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.  

విశ్వసనీయత ప్రశ్నార్థకం 

రాజకీయాల్లో విశ్వసనీయత   అనేది చాలా ముఖ్యం. జగన్ మోహన్  రెడ్డి తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెబుతూనే, ఆ ఈవీఎంలను పర్యవేక్షించిన అధికారులపై చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం ఆయన బలహీనతను సూచిస్తోంది. ఒకవేళ వైసీపీ ఈ తీర్మానం నుంచి తప్పుకుంటే, రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు  మీరు ఈసీని ఎందుకు నిలదీయలేదు అన్న ప్రశ్న ఎదురైతే జగన్ వద్ద సమాధానం ఉండదు. షర్మిల విసిరిన ఈ సవాల్‌తో జగన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారని, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన చేసే తదుపరి అడుగులు అత్యంత కీలకంగా మారాయని చెప్పవచ్చు.