Jagan Press Meet Analysis:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు , ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ఎంచుకుంటున్న అంశాలు, అవి రివర్స్ అవుతున్న తీరుపై రాజకీయ విశ్లేషకులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Continues below advertisement

 అనవసర చర్చలకు ఆస్కారం 

వైఎస్ జగన్ ప్రెస్ మీట్లలో తరచుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య  సందర్భోచితం కాని వ్యాఖ్యలు . ఏదైనా ఒక ప్రజా సమస్యపై మాట్లాడాలని భావించినప్పుడు, అనూహ్యంగా ఆయన గతం వైపు లేదా కుటుంబ చరిత్ర వైపు వెళ్తున్నారు. ఇటీవల ఆయన తన తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా హత్యల గురించి ప్రస్తావించడం రాజకీయంగా టీడీపీకి పెద్ద అస్త్రంగా మారింది. అసలు చర్చను పక్కదారి పట్టించి, కడప ఫ్యాక్షన్ చరిత్రను ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్ళేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇది ఆయనకు తెలియకుండా జరుగుతున్న ఫ్లో కాదని, భావోద్వేగంతో సానుభూతి పొందే ప్రయత్నమని కొందరు భావిస్తున్నప్పటికీ, అది అంతిమంగా విపక్షాలకు అనుకూలంగా మారుతోంది.

Continues below advertisement

 టీడీపీ  కౌంటర్  వ్యూహంలో చిక్కుకోవడం 

జగన్ ఎప్పుడైతే ఫ్యాక్షన్ లేదా హత్యల ప్రస్తావన తెస్తున్నారో, అప్పుడే టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతో పాత రికార్డులను, నాటి పత్రికల క్లిప్పింగులను సోషల్ మీడియాలో వదులుతున్నారు. జగన్ ఒక పాయింట్ మాట్లాడితే, టీడీపీ నేతలు పది పాత విషయాలను బయటకు తీస్తున్నారు. దీనివల్ల జగన్ చెప్పాలనుకున్న ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం పక్కకు పోయి, పాత నేరాల చరిత్రపైనే చర్చ సాగుతోంది. ఇది వైఎస్సార్సీపీకి వ్యూహాత్మక తప్పిదమనే చెప్పాలి.

 ప్రజా సమస్యల ఎంపికలో వైఫల్యం

ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే నిత్యావసర ధరలు, నిరుద్యోగం, లేదా అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి అంశాలను ఎంచుకోవాలి. కానీ, వైసీపీ తరచుగా వ్యక్తిగత దూషణలు లేదా గతంలో జరిగిన సంఘటనల చుట్టూనే తిరుగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గట్టిగా వినిపించడంలో వైసీపీ విఫలమవుతోంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ పార్టీ వెనుకబడుతోంది. జగన్ ప్రెస్ మీట్ తర్వాత నెరేటివ్ సెట్ చేయడంలో సోషల్ మీడియా వింగ్ విఫలమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ఆయన ప్రసంగంలోని పాజిటివ్ పాయింట్స్ కంటే, ఆయన మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలనే ప్రధాన వార్తలుగా ఇస్తుండటంతో, సామాన్య ప్రజల్లో జగన్ ఇంకా పాత గొడవల్లోనే ఉన్నారనే భావన కలుగుతోంది. ఇది పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తోంది.

 ఫ్లోలో జరుగుతున్నాయా.. కావలనే చేస్తున్నారా? 

 జగన్ తన సహజ ధోరణిలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే, సలహాదారులు ఆయనకు సరైన ఇన్పుట్స్ ఇవ్వకపోవడం లేదా ఆయన ఎవరి మాట వినకపోవడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయి. తనను తాను రక్షించుకునే   క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రత్యర్థులకు దాడి చేయడానికి  అవకాశాన్ని ఇస్తున్నాయని వైసీపీ క్యాడర్ భావిస్తోంది.  వైసీపీ  ఇలాంటి సమయంలో తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   గతాన్ని తవ్వడం మానేసి, వర్తమానంలో ప్రజలకు ఏం అవసరమో ఆ సమస్యలపై మాత్రమే ఫోకస్ చేయాలి. ఒక క్రమపద్ధతిలో, డేటాతో కూడిన విమర్శలు చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేకతను పట్టుకోగలరు. లేదంటే ప్రతి ప్రెస్ మీట్ ప్రత్యర్థులకు ఒక పండుగలా మారి, వైసీపీని మరింత రక్షణలో పడేస్తుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.