Political Psychological War AP: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న విభిన్న దర్యాప్తు సంస్థల విచారణల పర్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అంతర్గత వర్గాల్లో పెను తుఫానును రేపుతోంది. గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, భూ అక్రమాలతో పాటు మైనింగ్ వ్యవహారాలపై సిబిఐ, ఈడీ, ఏసీబీ ,  సీఐడీ సంస్థలు ముమ్మరంగా విచారణ జరుపుతున్నాయి. అయితే ఈ దర్యాప్తు కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అత్యంత నమ్మకమైన  కోటరీ   పునాదులను కదిలించేలా ఉండటమే సంచలనంగా మారుతోంది. 

Continues below advertisement

జగన్ పీఏ ఆస్తుల వ్యవహారంతో కొత్త దుమారం 

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన మలుపు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద   వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కేఎన్‌ఆర్  ఆస్తులపై దర్యాప్తు సంస్థలు జరుపుతున్న సోదాలు,  విచారణ. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన ప్రతి కీలక నిర్ణయం, ఫైళ్ల కదలికలు,  అంతర్గత వ్యవహారాలపై కేఎన్‌ఆర్‌కు పూర్తి అవగాహన ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆయన ఆస్తుల గుట్టుమట్లు రచ్చకెక్కడం, దర్యాప్తు సంస్థల విచారణలో అనేక కీలక డాక్యుమెంట్లు బయటపడటంతో తాడేపల్లి కోటరీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. దర్యాప్తు సంస్థలు వ్యూహాత్మకంగా వదులుతున్న కొన్ని లీకులు ఇప్పుడు వైసీపీ అగ్రనేతల మధ్య నమ్మకద్రోహపు అనుమానాలకు బీజం వేశాయి.

Continues below advertisement

ఒకరికి తెలియకుండా మరొకరు ఆర్థిక అవకతవకలు చేశారా? 

ఈ విచారణల ప్రక్రియలో బయటకు వస్తున్న సమాచారం ఆధారంగా.. జగన్ కోటరీలోని ముఖ్య నేతలు ఒకరికి తెలియకుండా ఒకరు తెరవెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు నడిపారని దర్యాప్తు సంస్థలు లీకులిస్తున్నాయి.  తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ కంటే మాకే ఎక్కువ నమ్మకస్తులు అని చెప్పుకునే కొందరు కీలక నేతలే, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంతర్గత అపనమ్మకం ఎంతలా ముదిరిందంటే.. నిన్నమొన్నటి వరకు ఒకే వేదికపై కూర్చుని వ్యూహాలు రచించిన నేతలు, ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడనంతగా అగాధాలు పెరిగిపోయాయని పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాడేపల్లి పార్టీ ఆఫీసుకు చెవిరెడ్డి దూరం

ఈ పరిణామాల తాలూకు ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, తాడేపల్లి వ్యవహారాల్లో కీలక చక్రం తిప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఇప్పుడు అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు రావడం లేదనే వార్తలు ఇందుకు బలమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. విచారణల వేడి తమ దాకా రాకుండా చూసుకోవడంతో పాటు, పార్టీలోనే తమను వెన్నుపోటు పొడిచేందుకు కొందరు స్కెచ్ వేస్తున్నారనే భయంతోనే పలువురు కీలక నేతలు స్వచ్ఛందంగా  సైలెంట్  మోడ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నమ్మకమే పెట్టుబడిగా సాగిన కోటరీలో ఇప్పుడు భయం, అపనమ్మకం రాజ్యమేలుతున్నాయి.

అసలు శిక్షల కన్నా ముందే రాజకీయ శిక్ష 

 దర్యాప్తు సంస్థలు రేపు కోర్టుల ముందు ఎలాంటి ఆధారాలు పెడతాయి, ఎవరికి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది భవిష్యత్తు తేల్చాల్సిన అంశం. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ విచారణల ద్వారా వైసీపీ అగ్రనేతల్లో ఒకరిపై ఒకరికి అనుమానాలు పెంచి, పార్టీని మానసికంగా,  వ్యూహాత్మకంగా దెబ్బతీయడంలో ఈ దర్యాప్తు అస్త్రాలు నూటికి నూరు శాతం విజయవంతమయ్యాయని చెప్పక తప్పదు. ఇది ప్రత్యర్థులు పన్నిన ఒక రకమైన  చీల్చే రాజకీయ వ్యూహం అని చెప్పుకోవచ్చు. నాయకుల మధ్య ఐక్యతను దెబ్బతీసి, ఒకరిని చూసి ఒకరు భయపడేలా చేయడం ద్వారా పార్టీని అంతర్గతంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ నడుస్తోందని స్పష్టమవుతోంది.

 జగన్ కోటరీలో దర్యాప్తు సంస్థల విచారణ పెట్టిన చిచ్చు అంత సులభంగా ఆరేలా కనిపించడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా లీకుల పర్వంతో లీడర్ల వ్యక్తిగత సామ్రాజ్యాలు బయటపడుతుండటంతో, జగన్ సైతం ఎవరిని నమ్మాలో, ఎవరిని పక్కన పెట్టాలో తెలియని సందిగ్ధంలో పడ్డట్లు పొలిటికల్ టాక్. చట్టపరమైన విచారణల కంటే, ఈ విచారణలు సృష్టిస్తున్న 'సైకలాజికల్ వార్'  రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.