Rajya Sabha Jharkhand Nomination Papers: జార్ఖండ్ రాజకీయాల్లో జూన్ 18న జరగబోయే రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపించినా, తెరవెనుక జరుగుతున్న సమీకరణాలు సరికొత్త సస్పెన్స్ను రేకెత్తిస్తున్నాయి.
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల వేళ రాంచీ నుండి ఢిల్లీ వరకు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అధికార ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా , కాంగ్రెస్ మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ పరిశీలకుల మధ్య జరిగిన చర్చల అనంతరం.. జేఎంఎం తరపున మాజీ మంత్రి బైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ తరపున ఏఐసీసీ సెక్రటరీ ప్రణవ్ ఝా బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక రాజ్యసభ సీటు గెలవడానికి 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా, అధికార కూటమికి 56 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన కూటమిలోని రెండు సీట్లు సులభంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, తెరవెనుక జరుగుతున్న 'థర్డ్ క్యాండిడేట్' వ్యూహాలు ఇప్పుడు అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో అసలైన సస్పెన్స్ ఎక్కడ మొదలైందంటే.. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతున్న వేళ ముగ్గురు ప్రముఖులు నామినేషన్ పత్రాలను కొనుగోలు చేయడం కలకలం రేపింది. బీజేపీ ప్రతినిధి గౌరవ్ వల్లభ్, ప్రముఖ పారిశ్రామికవేత్త, సిట్టింగ్ ఎంపీ పరిమళ్ నత్వానితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. విజయసాయిరెడ్డి జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే, అసలు ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి జార్ఖండ్ నుండి నామినేషన్ పేపర్లు ఎందుకు కొనుగోలు చేశారు? ఎవరి కోసం కొనుగోలు చేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.
విజయసాయిరెడ్డి స్వయంగా పోటీ చేయడానికి ఈ పత్రాలను కొనుగోలు చేయలేదని, దీని వెనుక ఒక పెద్ద కార్పొరేట్, జాతీయ రాజకీయ వ్యూహం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానికి మద్దతుగా , ఎన్డీయే కూటమి తరపున వ్యూహాత్మక డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు, ఏదైనా ఊహించని పొలిటికల్ ఈక్వేషన్ మారితే రంగంలోకి దిగడానికి క్లియర్ రూట్ ఉంచుకునేలా ఆయన ఈ పత్రాలను సేకరించినట్లు తెలుస్తోంది. గతంలో పరిమల్ నత్వాని జార్ఖండ్ నుండి పోటీ చేసినప్పుడు జేఎంఎం మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా నత్వాని స్వయంగా సీఎం హేమంత్ సోరెన్ను కలవడం, ఈ పరిణామాలన్నింటినీ విజయసాయిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా నామినేషన్ పత్రాలు తీసుకోవడం వెనుక ఆయనకు ఉన్న అపారమైన ఫైనాన్షియల్ , పొలిటికల్ నెట్వర్కింగ్ కారణమని భావిస్తున్నారు.
ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఒక అభ్యర్థి విజయానికి 28 ఓట్లు పోగా, ఇంకా 6 అదనపు ఓట్లు మిగిలి ఉంటాయి. ఈ ఆరు ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు బదిలీ చేస్తామని జేఎంఎం బహిరంగంగా చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సరిగ్గా ఈ ఆరు ఓట్లను, అలాగే ప్రతిపక్ష బీజేపీ , దాని మిత్రపక్షాల ఓట్లను నమ్ముకునే పరిమల్ నత్వాని ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు స్కెచ్ వేశారు. ఒకవేళ నత్వాని గనుక ఎన్డీయే మద్దతుతో రంగంలోకి దిగితే, కాంగ్రెస్ అభ్యర్థి విజయం కష్టతరంగా మారుతుంది.
మొత్తంగా చూస్తే, జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఎంత మంది ఫైనల్గా బరిలో ఉంటారనే దానిపై క్లారిటీ రానుంది. బీజేపీ తొలుత గౌరవ్ వల్లభ్ను రంగంలోకి దించాలని భావించినా, ఇప్పుడు వ్యూహం మార్చి నత్వానికి తెరవెనుక మద్దతు ఇచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ కార్పొరేట్ చదరంగంలో విజయసాయిరెడ్డి కొనుగోలు చేసిన నామినేషన్ పత్రాల వెనుక ఉన్న అసలైన లబ్ధిదారుడు ఎవరు? జేఎంఎం ఆరు మిగులు ఓట్లు ఎటు వైపు పడతాయి? అనేది రాబోయే రెండు రోజుల్లో తేలిపోనుంది.
