Women Reservation AP Politics:  ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారుతోంది. కేవలం పురుషాధిక్య ప్రసంగాలు, ఆరోపణలకే పరిమితం కాకుండా.. ఆధునిక ఆలోచనలు, గంభీరమైన వాగ్ధాటి కలిగిన యువ మహిళా నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో  ఉదయించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ముందే, ఏపీలోని ప్రధాన పార్టీలు  భవిష్యత్తు వారసురాళ్లను క్షేత్రస్థాయిలోకి పంపిస్తూ  పొలిటికల్ లాంచింగ్ కు శ్రీకారం చుట్టాయి. ఇది కేవలం వారసత్వ రాజకీయాల పొడిగింపు మాత్రమే కాదు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడే కొత్త సమీకరణాలకు ముందస్తు వ్యూహం.

Continues below advertisement

మహిళా నేతల్ని రెడీ చేసుకోవడంలో ముందున్న టీడీపీ 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయ అరంగేట్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో నియోజకవర్గ బాధ్యతలను భుజానికెత్తుకుని, సమస్యలపై ఆమె చూపిస్తున్న చొరవ కేడర్‌లో కొత్త జోష్ నింపింది. అలాగే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తికి మంత్రి లోకేష్ ఇచ్చిన  ఓపెన్ ఆఫర్ .. పార్టీ హైకమాండ్ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోంది. చదువుకున్న,  పరిజ్ఞానం ఉన్న యువతులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అసెంబ్లీలో చర్చల నాణ్యతను పెంచాలన్నది చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. టీడీపీలో ఇప్పటికే చాలా మంది మహిళా నేతలు చురుగ్గా ఉన్నారు. అందుకే లోకేష్.. కేంద్రంలో బిల్లు పాస్ అయినా లేకపోయినా పార్టీలో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించేశారు. 

Continues below advertisement

 ప్రాక్సీ లీడర్‌షిప్‌కు కాలం చెల్లిందా? 

గతంలో మహిళా రిజర్వేషన్లు అంటే భర్త లేదా తండ్రి చాటున ఉండి నామమాత్రపు పదవులు అనుభవించే వారనే ముద్ర ఉండేది. కానీ, నేటి యువత ఆ ముద్రను చెరిపేస్తోంది. ఐటీ రంగంలో, ఉన్నత విద్యలో రాణించిన ఈ తరం మహిళా నేతలు నేరుగా ప్రెస్ మీట్లు పెడుతూ, ప్రత్యర్థులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా వేదికగా విధానపరమైన విమర్శలు చేస్తున్నారు. టీడీపీ తమ  తెలుగు మహిళ  విభాగాన్ని ఆధునీకరిస్తుంటే, వైసీపీ సోషల్ మీడియాలోని యాక్టివ్ మహిళా వక్తలను గుర్తిస్తోంది.  2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో మహిళలకు 33 శాతం కోటా వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఏ నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తారో   తెలియని సందిగ్ధం పార్టీల్లో ఉంది. అందుకే సేఫ్ సైడ్‌గా ప్రతి కీలక నియోజకవర్గంలోనూ పురుష నేతకు ప్రత్యామ్నాయంగా ఆ కుటుంబం నుంచి ఒక మహిళా వారసురాలిని సిద్ధం చేసే ప్రక్రియ  వేగవంతమైంది. దీనివల్ల రిజర్వేషన్లు ఎలా మారినా అధికారం తమ కుటుంబం లేదా పార్టీ చేతుల్లోనే ఉంటుందన్నది వ్యూహం.

 డిజిటల్ గొంతుకలే బలమైన ఆయుధాలు 

ఇప్పుడు రాజకీయ యుద్ధం క్షేత్రస్థాయితో పాటు డిజిటల్ స్క్రీన్‌ల పైన కూడా జరుగుతోంది. వైకపా గొంతుకగా నిలిచే మహిళా సోషల్ మీడియా యాక్టివిస్టులు, టీడీపీ తరపున వాదించే యువ మేధావుల మధ్య జరుగుతున్న చర్చలు రాబోయే ఎన్నికల సరళిని మారుస్తున్నాయి. సబ్జెక్టుపై పట్టు ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని గుర్తించిన అధిష్ఠానాలు.. వారసత్వంతో పాటు వాగ్ధాటి, పరిపాలనపై అవగాహన ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ తన స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఈ యువ నేతల ప్రతిభను నిశితంగా గమనిస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు ఈ కొత్త తరం నేతలకు అసలైన పరీక్షా కేంద్రాలు. వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ఈ యువ మహిళా నేతలు తమ సత్తా చాటితేనే, 2029 అసెంబ్లీ ఎన్నికల టికెట్ రేసులో ముందుంటారు. మొత్తంమీద, ఏపీ రాజకీయాల్లో  మహిళా శక్తి  అనేది కేవలం ఓటు బ్యాంకుగానే కాకుండా, నిర్ణయాధికార శక్తిగా ఎదుగుతుండటం  మహిళా నేతల వికాసానికి మేలు చేస్తుంది.