Telangana Modi Tour :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఎప్పుడు ఖరారైనా అందరికీ ముందుగా వచ్చే సందేహం ఒక్కటే. ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా లేదా అనే. అయితే గత కొంత కాలంగా కేసీఆర్.. ప్రధాని మోదీకి ఆహ్వానం పలకడం లేదు. ఢిల్లీలో సమావేశం అయ్యేందుకు కూడా ప్రయత్నించడం లేదు. అయితే అప్పట్లో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించి ఉన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటి యుద్ధ వాతావరణం లేదు. కేసీఆరే వెనక్కి తగ్గి తేలిక పాటి వాతావరణాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ స్వాగతం చెబుతారా ?


8వ తేదీన మోదీ తెలంగాణ పర్యటన  
 
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై  8న ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మోడీ వరంగల్ కు రానున్నారు.రైల్వేశాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పాల్గొనేవన్నీ అధికారిక పర్యటనలే. బహిరంగసభ అధికారికమా.. పార్టీ పరమైన కార్యక్రమమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 


అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం సంప్రదాయం


ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడి సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలపై ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ పై విమర్శలు చేసినా సరే .. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇష్టపడలేదు. గతంలో చినజీయర్ ఆశ్రమంలో సమతా విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు కానీ.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి వచ్చినప్పుడు కానీ ఆయన స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి ఆ బాధ్యతలిచ్చారు. ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా రేగింది. సీఎంను ఆహ్వానించలేదని ఓ సారి బీఆర్ఎస్ మంత్రులు విమర్శించారు..కానీ ఆహ్వానం పంపామని కేంద్ర మంత్రులు ఖండించారు. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది కానీ..ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు ఉన్నా .. తెరపైకి వస్తూనే ఉంది. 


మారిన రాజకీయ పరిస్థితులు - కేసీఆర్ మనసు మార్చుకుంటారా ?


ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై కేసీఆర్ యుద్ధం దాదాపుగా ఆపేశారు. విమర్శలు కూడా చేయడం లేదు. తప్పని సరి సందర్భం వస్తే .. కాంగ్రెస్, బీజేపీ రెండింటిని విమర్శిస్తున్నారు. బయటకు చెప్పకపోయినా రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం మాత్రం లేదని.. తేలిక పడిందని అందరికీ స్పష్టత వచ్చింది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే ఆయనకు కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది అంచనా వేస్తున్న విషయం. అయితే ఇలా ఆహ్వానం చెబితే రెండు పార్టీల మధ్య అవగాహన నిజమేనని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఆహ్వానించలేదు..ఇప్పుడెందుకు ఆహ్వానించారని ప్రశ్నించేవారు ఉంటారు. గతంలో ప్రోటోకాల్ పాటించినట్లయితే ఇప్పుడు ఆహ్వానించినా సమస్య ఉండేది కాదు. మొత్తంగా మోదీ తెలంగాణ పర్యటనలో రాజకీయంగా కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial