Central Cabinet Telugu  States :   ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ తన టీంను పునర్వవ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సోమవారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. సాధారణంగా కేబినెట్ సమావేశాల్లో కేబినెట్ మంత్రులకే ఆహ్వానం ఉంటుంది. కానీ ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు అంటే.. సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ చార్జ్ ఉన్న  సహాయమంత్రులు కూడా హాజరవుతున్నారు. బహుశా.. తప్పించాలనుకున్న మంత్రుల వద్ద నుంచి అక్కడే రాజీనామా లేఖలు తీసుకునే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికలు జరగనున్న  రాష్ట్రాలకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. అందులో తెలంగాణ కూడా ఉంది. మరి తెలంగాణకూ మరో కేంద్ర మంత్రి పదవి లభిస్తుందా ? ఏపీ కి అసలు కేంద్రమంత్రే లేరు. ఏపీకీ ఓ చాన్సిస్తారా ?


ఎన్నికల కోసం కొత్త టీమ్‌ 


కర్ణాటక ఎన్నికల్లో ఓటమి.. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ అగ్రనాయకత్వం సుదీర్గ కసరత్తు జరిపింది.  ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ పలుమార్లు సమావేశమయ్యారు. చివరికి  పార్టీలో సంస్థాగత మార్పులతో పాటు కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు , చేర్పులు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.    ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో ప్రాతినిధ్యం కల్పిస్తారని భావిస్తున్నారు. గతంలో కంటే ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం అయ్యాయి.  ఈ సారి ఎక్కువ రాష్ట్రాల్లో ఎదురీదుతోందన్న ప్రచారం జరుగుతూండటమే కారణం. 


తెలంగాణ నుంచి మరొకరికి మంత్రి పదవి !


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ సారి మరో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వవొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనతో పాటు ఇద్దరు లోక్ సభ ఎంపీలు బండి సంజయ్,  ధర్మపురి అర్వింద్ కూడా బీసీ కేటగరిలోకే వస్తారు. చాన్స్ ఇవ్వాలనుకుంటే ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ ఇస్తారు.ఎస్టీ వర్గాలకు చాన్సివ్వాలనుకుంటే ఆదిలాబాద్ ఎంపీకి అదృష్టం తలుపు తడుతుంది. అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ధర్మపురి అర్వింద్ మొదటి సారి ఎంపీ అయ్యారు. లక్ష్మణ్ మాత్రం చాలా సీనియర్ అందుకే చాన్స్ ఇస్తే లక్ష్మణ్‌కే ఇవ్వొచ్చంటున్నారు. 


ఏపీ నుంచి సీఎం రమేష్‌కు చాన్స్ ఇస్తారా?   


సహజంగా ప్రతీ రాష్ట్రానికి ఓ కేంద్రమంత్రి ఉండేలా  కేంద్ర ప్రభుత్వం లెక్క తప్పకుండా చూసుకుంటుంది.  ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆ అవకాశం దక్కింది. తమిళనాడు, కేరళలకు కూడా కేబినెట్ మంత్రులున్నారు. కానీ ఏపీకి మాత్రం.. కేంద్రమంత్రి లేకుండా పోయారు. బీజేపీ తరపున ఏపీ నుంచి ఎంపీలు ఎవరూ లేరు.  టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి పదవి కాలం ముగిసింది.  సీఎం రమేష్ పదవి కాలం ఉంది. సాంకేతికంగా ఆయన బీజేపీ ఎంపీనే. అలాగే జీవీఎల్ నరసింహారావుకూ పదవీ కాలం ఉంది. కానీ ఆయన యూపీ నుంచి  రాజ్యసభకు ఎన్నికయ్యారు.  కానీ బీజేపీ హైకమాండ్ నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. ఏపీకి ఓ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే.. సీఎం రమేష్ లేదా జీవీఎల్‌లకు మాత్రమే చాన్స్ఉంది. ఇంకెవరిని తీసుకున్నా వారికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.  


సంస్థాగత మార్పులు కూడా తప్పవా ? 


ప్రధాని మోదీ  కేంద్రమంత్రి వర్గంతో పాటు వివిధ రాష్ట్రాల్లో నాయకత్వాలను కూడా మార్చాలని అనుకుంటున్నారు.   కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో నాయకత్వాలను మార్చాలని భావిస్తున్నారు. కర్ణాటక బీజేపీ చీఫ్ ఇప్పటికే రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్ లను మారుస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. బహుశా మూడో తేదీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంస్థాగత మార్పులను బట్టి వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర వ్యూహాలను కూడా అర్థం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 



Join Us on Telegram: https://t.me/abpdesamofficial