KCR Target 65 :  ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే.. దేశమంతా రైతు  బంధు అమలు చేస్తాం అని  కేసీఆర్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సుదీర్ఘ కాలంగా పరిపాలించి నాశనం పట్టించాయని.. భారత రాష్ట్ర సమితి దేశాన్ని అమెరికా కన్నా ఎక్కువ అభివృద్ది చేస్తుందని చెబుతూ వస్తున్నారు. అందుకే  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మర్చారు. కానీ కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణకే సమయం కేటాయిస్తున్నారు. కనీసం మరో పొరుగు రాష్ట్రం ఏపీ వైపు కూడా చూడటం లేదు. మరి ఢిల్లీ పీఠం ఎలా దక్కించుకుంటారన్నదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆయన పార్టీని ట్రోల్ చేస్తన్న వారు కూడా ఉన్నారు.కానీ కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. ఆయన ప్లాన్  చూస్తే అదే నిపించక మానదు. 


దేశం మొత్తం పార్టీని విస్తరించడానికి సమయం లేదు కాబట్టి ప్లాన్ బీ అమలు


కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత దేశం మొత్తం విస్తరించాలనుకున్నారు. రైతు సమస్యలపై ప్రధానంగా రైతుల్ని రాజకీయ నేతల్ని చేద్దామనుకున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేశారు. కానీ ముందగుగానే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో ముందు .. ఆ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీంతో ఒక్క మహారాష్ట్రపైనే  దృష్టి పెట్టి.. లక్ష్యం సాధించాలని నిర్ణయించుకున్నారు. తన వ్యూహాన్ని కేసీఆర్ సోమవారం మహారాష్ట్ర నుంచి వచ్చి చేరిన నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు చెప్పారు. తెలంగాణ , మహారాష్ట్రతో కలిపితే అరవైకి పైగా సీట్లు ఉంటాయని వాటిలో గెలిస్తే కేంద్రం మెడలు వంచవచ్చని స్పష్టం చేశారు. 


బీఆర్ఎస్‌కు పూర్తి మెజార్టీ కాదు..  చక్రం తిప్పే సీట్లు చాలు  ! 
  
65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ ప్లాన్ బీ అమలు చేస్తున్నారు.  మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని అంచనా వేస్తున్నారు.  బీఆర్ఎస్‌కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదని అంటున్నారు.  అందుకే ..  కేసీఆర్ పక్కా ప్రణాళికతో మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తున్నారని చెబుతున్నారు.  మహారాష్ట్రను బీజేపీ, కాంగ్రెస్, శివసేన మార్చలేకపోయాయని చెప్పారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే మహారాష్ట్రను ప్రపంచం అబ్బురపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఇంటింటికీ నల్లా నీరు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.


ప్రధాని పదవి ఇచ్చే కూటమికే కేసీఆర్ మద్దతు ఉంటుందా ?


కేంద్రంలోహంగ వస్తే సంకీర్ణ రాజకీయంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో.. ఎవరికి అదృష్టం పడుతుందో అంచనా వేయడం కష్టం. చక్రం తిప్పే వారిదే రాజ్యం అవుతుంది. గుజ్రాల్, దేవేగౌడ అలాగే ప్రధానమంత్రులు అయ్యారు. కేసీఆర్ కూడా అదే వ్యూహంతో ఉన్నారు. హంగ్ వచ్చి.. బీఆర్ఎస్ పార్టీ యాభైకి పైగా స్థానాలు దక్కించుకుంటే... బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్.. కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా బీజేపీ .. పోటీ పడి తమ పార్టీకి మద్దతిస్తాయని కేసీఆర్ నమ్మకం. అందుకే .. కష్టపడి దేశమంతా గెలిచే  బదులు..  ఒక్క మహారాష్ట్ర గెలిస్తే చాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా చెప్పవచ్చు.