Telangana Politics :  తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇప్పటికైతే త్రిముఖ పోరు ఖాయం. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత మారుతున్న పరిస్థితులతో  బీజేపీ రేసు నుంచి వైదొలుగుతోందన్న అభిప్రాయాన్ని బలంగా కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. అధికారికంగా బీజేపీ నుంచి ఒక్క నేత కూడా కాంగ్రెస్ లో చేరకపోయినా చేరికల సునామీ ఉంటుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముఖాముఖి పోరు ఉంటుందన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నిస్తోంది.  కాంగ్రెస్ వ్యూహం ఫలించి ముఖాముఖి పోరే జరిగితే..  ఫలితాలు అనూహ్యంగా ఉంటాయన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. 

కర్ణాటక ఎన్నికల తర్వాత డిఫెన్స్‌లో బీజేపీ 

కర్ణాటక ఎన్నికల తర్వాత  తెలంగాణ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఒక్క సారిగా తిరగబడింది.   పార్టీలోకి వెల్లువలా వస్తారు.. ఇంత మంది నాయకులు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ లాంటి నేతలు ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మా పార్టీ నుంచి వారెవరూ వెళ్లడం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది. ఆ పార్టీలో చేరిన నేతలందరిపైనా .. పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక పార్టీలో చేరిపోతారని చెప్పుకున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టమయింది. బీజేపీలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని ఈటల రాజేందర్ మాటలు బీజేపీ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడల్లా బీజేపీలో చేరికలు ఉండే అవకాశం లేదని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. 

మైండ్ గేమ్ ఆడుతున్న రేవంత్ రెడ్డి !

బీజేపీలో ఉక్కపోతుకు గురవుతున్న నేతల విషయంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి   మైండ్ గేమ్ ఆడుతున్నారు.    బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని  ప్రచారం జరగడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.  బీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారు చేస్తే.. టిక్కెట్ దొరకని ప్రముఖ నేతలంతా బీజేపీలోకి వస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడంతా వారు గాంధీ భవన్ ముందు క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇద్దరు మాజీ ఎంపీలు..నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హైకమాండ్ తో టచ్‌లో ఉన్నారంటూ ప్రచారాలు ప్రారంభిస్తున్నారు. కారణం ఏదైనా..  కాంగ్రెస్ ఇప్పుడు నేతలకు ఫేవరేట్‌గా మారింది.  

బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరితే.. ముఖాముఖి పోరు అవకాశం 

ఇటీవల బీజేపీ -  బీఆర్ఎస్ మధ్య బాండింగ్ పెరుగుతోందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.  కేవలం కేసీఆర్ ను ఓడించాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి  కొంతమంది బీజేపీలో చేరారు. కాంగ్రెస్ వల్ల కాదని.. బీజేపీ మాత్రమే ఓడించగలుగుతుందని వారు నమ్మారు. దీనికి కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటమే. బెంగాల్ లో బీజేపీ చేసిన రాజకీయం తరహా తెలంగాణలోనూ చేస్తారని అనుకున్నారు. కేసులు అరెస్టులతో బీఆర్ఎస్ ను బలహీనం చేస్తారనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేకపోయింది. కవిత జోలికి ఈడీ రాకపోతూండటంతో..ఏదో జరుగుతోందని  బీజేపీలో చేరిన నేతలకు అనుమానం వచ్చింది. అందుకే ఇటీవల బీజేపీ , బీఆర్ఎస్ బంధంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినట్లుగా కనిపిస్తూండటంతో వారు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరితే బీజేపీ బలహీనపడిపోతుంది. అప్పుడు రేసులో నుంచి వైదొలిగినట్లవుంది.

ముఖాముఖి పోరు జరిగితే కాంగ్రెస్ కు అడ్వాంటేజేనా

ముఖాముఖి పోరు అంటూ జరిగితే అది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కన్సాలిడేట్ అయితే అధికార పార్టీకి ఇబ్బందే. బీజేపీ బలంగా ఉండి ఉంటే మూడు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ విజయం సునాయాసం అవుతుంది. కానీ ఇప్పుడు ముఖాముఖి పోరు కోసం .. కర్ణాటక విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.