Why YSRCP Leaders Silent On Jagan Mavigun Agenda: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని  అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఐదేళ్ల పాటు  మూడు రాజధానుల  నినాదంతో గందరగోళానికి తెరలేపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా జూలై 2026 లో సరికొత్తగా మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు  కోస్తా అర్బన్ కారిడార్  అజెండాను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి  అనేదే తమ పార్టీ ప్రధాన ఎన్నికల ఎజెండా అని, దీనిని మేనిఫెస్టోలో కూడా పెడతామని జగన్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధినేత ఇంత పెద్ద పొలిటికల్ బాంబు పేల్చినా,  అనుబంధ మీడియా, సోషల్ మీడియా వింగ్  , పార్టీ సీనియర్ నేతలు దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన నేతలెవరూ ఈ టాపిక్‌ను ఓ రేంజ్‌లో జనాల్లోకి తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపించడం లేదు.  

Continues below advertisement

ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారా? 

మొదటి ప్రధాన కారణం..  ఉత్తరాంధ్ర, రాయలసీమ  ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరుగుతుందనే భయం. గతంలో జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నప్పుడు విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుకు జ్యుడీషియల్ క్యాపిటల్ అన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని   నేతలు, కేడర్  మా ప్రాంతానికి రాజధాని వస్తోంది  అని గర్వంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ ప్రతిపాదిస్తున్న  మావిగన్  పూర్తిగా కృష్ణా, గుంటూరు జిల్లాల  పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు గనుక  వైసీపీ సోషల్ మీడియా దీనిని విపరీతంగా ప్రమోట్ చేస్తే..  మరి విశాఖ, కర్నూలు పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్ర, రాయలసీమలను జగన్ వదిలేశారా?" అని కూటమి శ్రేణులు కౌంటర్ అటాక్ చేయడం ఖాయం. ఈ రీజినల్ సెంటిమెంట్ దెబ్బతింటుందనే భయంతోనే ఆయా జిల్లాల  వైసీపీ  నేతలు ఈ టాపిక్‌ను ముట్టుకోవడానికే భయపడుతున్నారు.

Continues below advertisement

లీగల్ ట్రాప్ - పార్లమెంట్ చట్టం  

 ఇటీవల కేంద్ర పార్లమెంట్ 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ  చట్టం ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా గెజెట్‌లో పొందుపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో చట్ట విరుద్ధంగా మళ్లీ కొత్త కారిడార్ల పేరుతో రాజధానిని మారుస్తామనే భ్రమలు కల్పిస్తే.. న్యాయపరంగా పార్టీ మళ్లీ డిఫెన్స్‌లో పడుతుందని వైసీపీ  అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు అమరావతిలో ప్రపంచ బ్యాంకు నిధులతో పనులు పరుగులు పెడుతుంటే, సామాన్య ఓటర్లు కూడా మళ్లీ రాజధాని మార్పుల గందరగోళాన్ని కోరుకోవడం లేదు. అందుకే, సోషల్ మీడియాలో ఈ టాపిక్‌ను ఎక్కువగా కెలికితే.. నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందని ఐటీ సెల్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయింది.

అమరావతిని ఆపడానికే ప్రయత్నమా ? 

అధికార కూటమి ఈ ప్రతిపాదనను తిప్పికొడుతున్న తీరు కూడా  వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు వంటి నేతలు జగన్ మూడు రాజధానులు డెవలప్ చేసింది నిజమే.. కానీ అవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ మాట మార్చే నైజాన్ని  ఎండగడుతూ..  2014లో అమరావతికి జై కొట్టారు, 2019లో మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు 2026లో మావిగన్ అంటున్నారు.. అసలు జగన్‌కు ఒక స్థిరమైన ఆలోచన ఉందా  అని టీడీపీ సోషల్ మీడియా వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైకాపా కేడర్ నీళ్లు నములుతోంది. జగన్ మోహన్ రెడ్డి 'మావిగన్' అనే కొత్త అజెండాను ప్రకటించింది కేవలం అమరావతిలో జరుగుతున్న భారీ అభివృద్ధి, పెట్టుబడుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమేనని క్షేత్రస్థాయి నేతలు భావిస్తున్నారు.  పైగా, వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో.. అప్పుడే ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లి 'క్యాపిటల్ సెంటిమెంట్‌'ను పాడుచేసుకోవడం కంటే, ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టడమే మంచిదనే అంతర్గత వ్యూహంతోనే వైసీపీ మీడియా,  సోషల్ మీడియా దీనిని పెద్దగా పట్టించుకోనట్లు నటిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, అధినేత విసిరిన 'మావిగన్' బాణం.. సొంత పార్టీలోనే పట్టు కోల్పోయి, కేవలం తాడేపల్లి ప్రెస్ మీట్లకే పరిమితమైపోయిందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.