2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన మరుసటి రోజే తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి పోటీయో స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం విజయన్‌తో పాటు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 


కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో పాల్గొనని అఖిలేష్ యాదవ్ కేసీఆర్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం రాజకీయంగా దుమారం రేగుతోంది. గతంలో కూడ కేసీఆర్, శరద్ పవార్, మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థులుగా అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ర్యాలీకి ఎందుకు వచ్చారో ఓసారి చూద్దాం.


1. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కసరత్తు: అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి బలమైన ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. వీరిలో మమతా బెనర్జీ, శరద్ పవార్, లాలూ ప్రసాద్‌ యాదవ్, కేసీఆర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఈ నేతలు తీవ్రంగా పోరాడారు.


థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఏ నాయకుడూ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్న తీరు చూస్తుంటే దీనిపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. యూపీలో ఫ్రంట్ ఏర్పాటు కారణంగానే 2022 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు అఖిలేష్. అదే మ్యాజిక్‌ 2024లో రిపీట్ చేయాలని ఆలోచనలో ఆ పార్టీ ఉంది. 


2. సీట్ల పంపకం యూపీలో చేయనవసరం లేదు - బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఓటు బేస్‌ ఉన్న పార్టీ. అందుకే దాని ప్రధాన బలం తెలంగాణలోనే ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. కేసీఆర్ తో కలిసి వెళితే యూపీలో సీట్ల పంచాయితీ లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అఖిలేష్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే కచ్చితంగా యూపీలో కొన్ని సీట్లు వాళ్లకు కేటాయించాలి. ఇప్పుడు ఆ బెడద ఉండదని ఆ పార్టీ ఆలోచన. 


జనవరి 30న రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు రావాలని 16 ప్రతిపక్షాలకు కాంగ్రెస్ ఆహ్వానించింది. కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, అసదుద్దీన్ ఒవైసీని మాత్రం పిలవలేదు. అందుకే కేసీఆర్ ర్యాలీకి వెళ్లడం ద్వారా కాంగ్రెసేతర పక్షానికి మద్దతుకు ఇస్తున్నట్టు అఖిలేష్ సంకేతాలు పంపించారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ రావాలని గతంలో కూడా చాలా సార్లు అఖిలేష్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు. 


కాంగ్రెస్‌తో పడటం లేదా?


2017లో యూపీలో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 403 సీట్లకు గాను ఎస్పీ 47 స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ కు 7 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు ఉండదని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.


1. కాంగ్రెస్ కు తగ్గుతున్న ప్రజాదరణ- 2009 నుంచి యూపీలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు తగ్గుతూ వస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 21 సీట్లు, 18.25 శాతం ఓట్లు వచ్చాయి. 2014లో ఆ పార్టీకి 7.53 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి.


2019 ఎన్నికల్లో యూపీలో పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ ఫిరాయించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి 6 శాతం ఓట్లు వచ్చాయి.


2. సీట్లకు డిమాండ్ ఎక్కువ: కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువమంది కార్యకర్తలు తక్కువ మంది ఉన్నారని అఖిలేష్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజాదరణ లేకపోయినా యూపీలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కు అఖిలేష్ దూరం కావడానికి ఇది రెండో ప్రధాన కారణం.


నితీశ్ కూటమికి అఖిలేష్ ఎందుకు దూరంగా ఉన్నారు?


బిహార్‌లో బీజేపీతో విభేదాలు వచ్చిన తర్వాత కూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్ కుమార్ దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరం లేదని ప్రకటన చేశారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌తో అనుసంధానం చేసి ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. శరద్ పవార్, సోనియా గాంధీ, సీతారాం ఏచూరి వంటి అనుభవజ్ఞులతో సహా ఆరుగురు పెద్ద నాయకులను నితీష్ ఢిల్లీలో కలిశారు. నితీశ్‌ చేస్తున్న ఈ ప్రయత్నానికి అఖిలేష్ ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


కాంగ్రెస్ సాయంతో యూపీ రాజకీయాల్లో నితీశ్ ప్రవేశించవచ్చని అఖిలేష్ భయపడుతున్నారు. నితీశ్ కు చెందిన కుర్మీ కులం యూపీలో 5-6 శాతం జనాభా ఉంది. కుర్మీ సామాజికవర్గం నుంచి వచ్చిన పెద్ద నాయకుల్లో ఎక్కువ మంది బీజేపీ వెంటే ఉన్నారు. ఈ ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకోవడానికి అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. కానీ  ఇసిబి, ఒబిసి సహాయంతో యుపిలో నితీష్ కుమార్ తన పార్టీకి సవాలుగా మారడం కూడా అఖిలేష్‌కు ఇష్టం లేదు. అందుకే ఆయన నితీష్‌ కూటమికి దూరంగా ఉంటున్నారు. కేసీఆర్‌తో అయితే తన పార్టీకి, తన ఉనికికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని నమ్ముతున్నారు. అందుకే కేసీఆర్‌ కూటమికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.