Mayawati Political Successor Akash Anand: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి (Mayawati) ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌‌ (Akash Anand)ను ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నాహాల కోసం లక్నోలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 28 ఏళ్ల మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. 


అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో పార్టీకి మాయావతి అధ్యక్షత వహిస్తారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కేడర్‌కు ఆకాష్‌ ఆనంద్‌ నాయకత్వం వహిస్తారని బీఎస్పీ నేత ఉదయ్‌వీర్ సింగ్ తెలిపారు. యువతను పార్టీతో అనుసంధానం చేసే బాధ్యతను ఆకాశ్‌కు అప్పగించారు. పార్టీ వ్యవస్థ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను మాయావతి ఆకాష్‌కు అప్పగించారు. 


ఎవరీ ఆకాష్ ఆనంద్?
మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కుమారుడే ఆకాష్‌ ఆనంద్‌. గురుగ్రామ్ లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత లండన్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు. 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆకాష్ ఆనంద్ ప్రస్తుతం బీఎస్పీలో నేషనల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. అనేక ఎన్నికల రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా చేశారు. గత ఏడాది నుంచి బీఎస్పీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. 


2017లోనే పార్టీ కేడర్‌కు సంకేతాలు
2017లో సహరాన్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి తొలిసారిగా ఆకాష్ ఆనంద్‌ను తనతో పాటు వేదికపై కూర్చోబెట్టి, భవిష్యత్తులో బీఎస్పీ సంస్థలో ఆకాష్ కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో, 2019 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆకాష్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా చేశారు. యువతను పార్టీతో అనుసంధానం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.


మాయావతిపై తీవ్ర విమర్శలు
2019లో ఆనంద్‌ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా మాయావతి నియమించారు. ఆసమయంలో ఆమె బంధుప్రీతి చూపుతున్నారనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆనంద్ బీఎస్పీ ఉపాధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించారు.  కొద్ది కాలం తరువాత జూన్‌లో సోదరుడు ఆనంద్ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా మాయావతి నియమించారు.


2019లో ఎన్నికల సంఘం మాయావతిపై 48 గంటల ప్రచార నిషేధాన్ని విధించినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ఆకాష్ ఆనంద్ తొలిసారి రాజకీయ ర్యాలీలో ప్రసంగించారు. ఆ తరువాత క్రమక్రమంగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు.  గత ఏడాది మార్చిలో మాయావతి ఆకాష్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 


150 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా మూడున్నర వేల కిలోమీటర్ల మేర ‘సర్వజన్ హితాయ, సర్వజన్ సుఖాయ్ సంకల్ప యాత్ర’కు నాయకత్వం వహించారు. ఇటీవల ముగిసిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో మాజీ రాజ్యసభ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ కుమార్తె డాక్టర్ ప్రజ్ణాను ఆకాష్ వివాహం చేసుకున్నారు


సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
పార్టీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆకాష్ ఆనంద్ మొదట సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను మాధ్యమంగా ఉపయోగిస్తూ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‭‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తన ఉనికిని పెంచుకుంటోంది. బీఎస్పీ అధినేత మాయావతి హ్యాండిల్ పనులన్నీ కూడా ఆకాష్ ఆనంద్ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి.