Rajagopal Reddy declaring war on the CM : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతా ఒకే మాట.. ఒకే బాట అన్నట్లుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస విజయాలతో హైకమాండ్ వద్ద తన మార్కును సుస్థిరం చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగడంతో రేవంత్ పట్టు మరింత పెరిగింది. ఇలాంటి తరుణంలో పార్టీలోని సీనియర్లు, జూనియర్లు అంతా రేవంత్‌తో సఖ్యతగా ఉంటూ పదవులు దక్కించుకోవాలని చూస్తుంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తనదైన  బ్లాక్ మెయిల్  రాజకీయంతో రేవంత్ రెడ్డి కుర్చీకే ఎసరు పెడతానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Continues below advertisement

మంత్రి పదవి కోసం సీఎం బెదిరింపులు 

రాజగోపాల్ రెడ్డి తీరు ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద జోక్‌లా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రిని అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మునుగోడును మీరు చూసుకోండి.. తెలంగాణను నేను చూసుకుంటాను" అంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం రేవంత్ రెడ్డికి హెచ్చరికలు పంపడమే. అయితే, నిజంగానే సీఎం అయ్యే అవకాశం ఉంటే, ఒక చిన్న మంత్రి పదవి కోసం ఇంతలా ఎందుకు పాకులాడుతున్నారనే ప్రశ్న సామాన్య కార్యకర్త నుంచి కూడా వినిపిస్తోంది. ఈ రకమైన విరుద్ధ ప్రకటనలు ఆయన రాజకీయ పరిణతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Continues below advertisement

 ఆత్రం ఎక్కువ.. ఆలోచన తక్కువ 

రాజగోపాల్ రెడ్డి రాజకీయ చరిత్రను గమనిస్తే, ఆయన ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలతోనే ఇబ్బందుల్లో పడ్డారు. 2022లో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని భావించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికను బలవంతంగా రుద్ది, చివరకు ఓటమి పాలు కావడమే కాకుండా, తనతో పాటు పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయానికి మళ్ళీ కాంగ్రెస్ గాలి వీస్తుందని గ్రహించి, పాత గూటికే చేరారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసే నేతలకు హైకమాండ్ వద్ద గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదు. ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోవడానికి ఆయన గత తప్పిదాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 రేవంత్ వ్యూహం..  వెంకన్న కే ప్రాధాన్యత 

కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే నిబంధనను తెరపైకి తెచ్చి రాజగోపాల్‌ను పక్కన పెట్టారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉంటూ, రేవంత్ రెడ్డితో సమన్వయంగా సాగుతున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ పాలనపై దృష్టి పెట్టిన వెంకట్ రెడ్డిని కాదని, నిత్యం విమర్శలు చేసే రాజగోపాల్ రెడ్డిని టీమ్‌లోకి తీసుకోవడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమేనని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే, రాజగోపాల్ రెడ్డి ఎంతగా ఒత్తిడి తెచ్చినా రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యూహాన్ని మార్చుకోవడం లేదు.

బెదిరింపులతో పదవులు వస్తాయా? 

రాజకీయాల్లో పదవి అనేది అడగకపోయినా వచ్చే గుర్తింపుతో రావాలి లేదా విధేయతతో సాధించుకోవాలి. కానీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం ‘ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేయండి.. లేదంటే పదవిని లాక్కుంటాను’ అంటూ చేస్తున్న హెచ్చరికలు పార్టీలో ప్రతికూల సంకేతాలను పంపుతున్నాయి. ఇలా బెదిరిస్తే పదవి ఇచ్చారనే సందేశం వెళ్తే, రేపు ప్రతి ఎమ్మెల్యే ఇదే బాట పడతారని అధిష్టానం ఆందోళన చెందుతోంది. అందుకే, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఉన్నా, ఇప్పుడు ఈ బెదిరింపుల  కారణంగా ఇవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

 ఉక్కపోతలో మునుగోడు నేత 

ప్రస్తుత పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి అటు ఇటు కాకుండా పోయారు. రేవంత్ రెడ్డి పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదగడం, హైకమాండ్ ఆయనకే పూర్తి మద్దతు ఇవ్వడం చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం వల్ల ఆయన కేడర్‌లో కూడా అయోమయం నెలకొంది. తన తొందరపాటు రాజకీయాలు , అవకాశవాద ధోరణి వల్ల రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీలోనే ఒంటరిగా మారి, తీవ్రమైన రాజకీయ ఉక్కపోతకు గురవుతున్నారు.