YSRCP Reaction :  తెలుగుదేశం , బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని జససేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించడంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. మఖ్యంగా కాపు సామాజికవర్గ నేతలు, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రసంగంలో ఇదే చెప్పారు. తాను ఏదైనా మాట్టాడగానే బుడతల్ని రంగంలోకి దించుతారని.. వారికి ఎందుకు సీఎం పదవి ఇవ్వరని ప్రశ్నించారు. అయితే అయనపై వైసీపీ కాపు సామాజికవర్గ నేతల దాడి మాత్రం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఎందుకు ఇంత కంగారు పడుతోంది ?

పవన్‌పై ఆయన వర్గంతోనే  ఎటాక్‌కు కారణం ఏమిటి ?

పవన్ కల్యాణ్‌పై ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలతోనే విమర్శలు చేయించడానికి ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ఉన్న అత్యధిక ఓటు బ్యాంక్ కాపు సామాజికవర్గానిదేనని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆ వర్గం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా నిలబడటం వల్లనే భారీ మెజార్టీ వచ్చిందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఈ సారి పవన్ కల్యాణ్‌క ఆ వర్గం ఓట్లు వేస్తే వైఎస్ఆర్‌సీపీ తీవ్రంగా నష్టపోతుందని అందుకే కాపు వర్గంలో ఆయన ఒక్కరే కాదని..తాము కూడా నేతలమేనని చెప్పడానికి వారు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాపు సామాజికవర్గాన్ని ఏకపక్షంగా జనసేన వైపు పోకుండా చూసే ప్లాన్ లోనే ఎదురుదాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

టీడీపీతో కలిస్తే జనసేనకు అధికారంలో భాగం - ఓట్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశం 

గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అప్పట్లో ఆ పార్టీకి కాపు వర్గం అండగా నిలబడలేదు. చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనికి కారణం ఆయన బీఎస్పీతో కలిసి పోటీ చేయడమే కారణమని భావిస్తున్నారు. గెలిచే అవకాశం లేదు కాబట్టి ఓటు వృధా పోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది జనసేన అభిమానులు కూడా ఓట్లు వేయలేదని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సారి పవన్ కల్యాణ్.. టీడీపీతో జత కట్టాలని నిర్ణయించుకున్నారు. కూటమి గెలిస్తే..జనసేన పార్టీకి ఖచ్చితంగా అధికారంలో భాగం లభిస్తుంది. కాపు వర్గం కోరుకునే అధికారం లభిస్తుందన్న కారణంగా వారి ఓటు  బ్యాంక్ జనసేన వైపు కన్సాలిడేట్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే వైఎస్ఆర్‌సీపీకి ఆందోళన కలిగిస్తోందని అంచనా  వేస్తున్నారు. 

పవన్ పై దూషణలతో  వైసీపీకి మరింత దూరం !

అయితే రాజకీయ విమర్శలు వేరు.. వ్యక్తిగత విమర్శలు వేరు. వైసీపీ నాయకులు రాజకయ విమర్శలను..  వ్యక్తిగత విమర్శలను కలిపేశారు. ఇంకా చెప్పాలంటే కేవలం వ్యక్తిగత విమర్శలే చేస్తున్నారు. అవి కూడా పవన్ కల్యాణ్ ను కించ పరిచేలా ఉంటున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి అన్నీ మాట్లాడుతున్నారు. ఇది కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి మరో కారణం అవుతోందని చెబుతున్నారు. కారణం ఏదైనా టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోకూడదని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. దమ్ముంటే ఒంటరిగా రమ్మని సవాల్ చేస్తున్నారు. కానీ తాము చేయాలనుకున్నదే చేస్తామని..మీరు చెప్పింది కాదని అంటున్నారు. మొత్తంగా టార్గెట్ పవన్ కాన్సెప్ట్ ను వైసీపీ మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.