Vizianagaram Tdp : సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. అధికార వైసిపి జోరుగా అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో టిడిపి, జనసేన కూటమి నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించేదిగా ఇరు పార్టీల అగ్ర నాయకులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే పొత్తుపై స్పష్టత వచ్చిన కొన్ని సీట్ల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించే దిశగా ఇరు పార్టీలో సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో విజయనగరం పార్లమెంటు స్థానం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించేలా ఒప్పందం జరిగినట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి డెంకాడ ఎంపీపీగా పని చేస్తున్న కంది చంద్రశేఖర్ తోపాటు వెంకటేష్ పేర్లను తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. వీరిలో ఒకరికి సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. వీరు కాకుండా  పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా తమ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నాలను సాగిస్తున్నారు.


 అశోక్ కుటుంబం నుంచి నిరాసక్తత


 గత ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి పోటీ చేసేందుకు ఆయన తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అలియాస్ శ్రీనును బరిలోకి దించేందుకు వైసిపి ఆలోచన చేస్తోంది. వీరిద్దరిలో ఎవరికి సీటు కేటాయించాలన్న దానిపై వైసీపీ నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి అభ్యర్థిని బట్టి  కూటమి అభ్యర్థిగా బలమైన వ్యక్తిని బరిలోకి దించాలని టిడిపి భావిస్తోంది. ప్రస్తుతం పరిశీలిస్తున్న వెంకటేష్, చంద్రశేఖర్ తోపాటు విదేశాల ఉంటున్న ఒక ఎన్నారై పేరును తెలుగుదేశం పరిశీలిస్తోంది. బొత్స కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే  వారిని ధీటుగా  ఎదుర్కొనేందుకు ఆర్థిక, అంగ బలం ఉన్న వ్యక్తులను ఇక్కడ బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఆర్థిక స్తోమతతోపాటు సామాజిక సమీకరణాల లెక్కలను అధిష్టానం వేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించితే విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే చంద్రశేఖర్  పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన కూడా ఈ స్థానం పట్ల ఆసక్తిని చూపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయడం కన్ఫామ్ అయింది.


 టిడిపిలోకి చేరే ఛాన్స్


 వైసీపీలో సీట్ల వ్యవహారం కొలిక్కి వస్తే అసంతృప్తితో ఉండే కొందరు నేతలు టిడిపిలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జాబితాలో ఎస్.కోటకు చెందిన ఒకరిద్దరు ముఖ్య నాయకులతోపాటు చీపురుపల్లి నుంచి కూడా సీటు రాకపోతే కీలక నేత టిడిపిలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నేత టిడిపిలో చేరితే ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. సదరు నేత సీటుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీ సీటు దక్కించుకోవడంపై  ఇరు పార్టీల్లోనూ పోటీ నెలకొనడం అధిష్టానాలకు ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇరు పార్టీల అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.