BJP National Executive New Team: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు దక్కాయి. జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవికి ఎదిగిన ఆయన కృషి వెనుక దశాబ్దాల పాటు ఆయన సాగించిన నిరంతర , సంస్థాగత శ్రమ దాగి ఉంది. 1978 అక్టోబర్ 2న ఆర్ఎస్ఎస్ అనుబంధమున్న కుటుంబంలో జన్మించిన ఆయన, అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా అతి చిన్న వయసులోనే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. 1992లో కదిరి తాలూకా కార్యదర్శిగా ప్రారంభమై అనంత్ పూర్ జిల్లా కన్వీనర్, ఉమ్మడి ఏపీ కార్యదర్శిగా మరియు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 1998 వరకు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
విద్యార్థి దశ పూర్తయిన తర్వాత భారతీయ జనతా యువమోర్చా లో ప్రవేశించి అనంతపురం జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగా , ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు ఉమ్మడి, విభజిత ఏపీలో సుదీర్ఘకాలం BJYM రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి యువతను పార్టీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే 2006 నుంచి బీజేపీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర శిక్షణ విభాగ కన్వీనర్గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రెండు విడతలుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించారు.
ఆయన ప్రతిభకు, కార్యనిర్వహణ సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు లభించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ ఛైర్మన్గా 2018-2021 వరకూ నియమితులై జాతీయ స్థాయిలో సేవలు అందించారు. అంతేకాకుండా యువ భారత్ ఎన్జీఓ ద్వారా యువతను రక్షణ, పోలీస్ రంగాల వైపు ప్రోత్సహించడంతో పాటు శ్రీ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్గా విద్యారంగంలోనూ పలు కళాశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
విద్యార్హతల పరంగా బి.ఎస్సీ , శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ సిద్ధాంతాలపై పూర్తి పట్టు ఉన్న వ్యూహకర్తగా పేరుపొందారు. టీవీ చర్చలు, మీడియా వేదికలపై బీజేపీ విధానాలను సమర్థవంతంగా వినిపిస్తూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ లక్షలాది మంది మద్దతుదారులను కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి ఏబీవీపీ, బిజెవైఎమ్, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగిన విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు జాతీయ స్థాయిలో 'ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్'గా బాధ్యతలు దక్కడం ఆయన కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలం. కేంద్ర నాయకత్వం వహించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, దేశవ్యాప్తంగా పార్టీ అనుబంధ విభాగాలు, సెల్స్ సమన్వయంలో ఆయన తనదైన మార్క్ చూపిస్తారని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
విష్ణువర్ధన్ రెడ్డి .. బాధ్యతలు నిర్వహించనున్న అన్ని అనుబంధ శాఖల సమన్వయం టీమ్కు విష్ణుదత్ శర్మ కోఆర్డినేటర్గా ఉంటారు. విష్ణు దత్ కీలక జాతీయ నేత, వ్యూహకర్త. మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతమైన సంస్థాగత నాయకత్వాన్ని అందించి పార్టీ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఖజురహో నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు భారీ మెజారిటీలతో ఎంపీగా ఎన్నికయ్యారు. గ్రాస్రూట్ స్థాయి నుంచి కేడర్ను నడిపించడంలో అపార అనుభవం కలిగిన ఆయన, ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వంలో జాతీయ 'ఆల్ సెల్స్ కో-ఆర్డినేటర్'గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
