బెజవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకోసం ప్రయత్నిస్తోంది. వచ్చే 2024ఎన్నికల్లో ఎట్టి పరిస్దితుల్లోనూ తూర్పు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవినాష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు. అంతే కాదు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్ది కూడా దేవినేని అవినాష్ అని, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో స్పష్టం చేశారు. దీంతో దేవినేని అవినాష్ దూకుడు పెంచారు. నియోజకవర్గంలో పట్టుకోసం అవసరం అయిన అన్ని ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే  ఇదే సమయంలో అవినాష్ వివాద రహితుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గొడవలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని తన క్యాడర్ పక్కాగా చెబుతున్నారు. 


నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ప్లన్ పాయింట్స్


నియోజకవర్గంలో 22 మంది కార్పొరేటర్లు ఉండగా, అందులో ఏడు టీడీపీ కాగా మిగిలినవి అన్ని వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో వైసీపీకి ఓటింగ్ ఎక్కువగా దక్కే అవకాశం ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకం అయిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావటం కూడా వైఎస్ఆర్సీపీకి మైలేజీని దక్కించింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి కావటంతో వైఎస్ఆర్ సీపీకి ప్లస్ పాయింట్ గా మారింది. దీని వలన కొన్న వందల కుటుంబాలు కృష్ణా నది ముంపు నుంచి విముక్తి కలిగిందని అంటున్నారు. ఇక అవినాష్ విషయానికి వస్తే యువ నాయకుడు కావటం, పూర్తిగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావటంతో పాటుగా, ఎమ్మెల్యే కాకపోకయినా నియోజకవర్గంలో పనులు వేగంగా పని చేయటం, అర్హులకు పథకాలను అందించేందుకు చర్యలు తీసుకోవటం వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లో సైతం అవినాష్ పర్యటించటం, అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవటం కలిసి వచ్చే అంశం. మంత్రి పెద్దిరెడ్డితో ఉన్న అనుబంధం కూడా అవినాష్ కు ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు.


మైనస్ పాయింట్స్


దేవినేని ఫ్యామిలీ అనగానే బెజవాడలో కొంత వరకు టెన్షన్ పరిస్దితులు ఉంటాయి. గతంలో విజయవాడ కేంద్రంగా చేసుకొని రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం తారా స్దాయికి చేరి రాజకీయాలను సైతం తలకిందులు చేసిన నేపద్యంలో అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అవినాష్ ఆ నింద నుంచి బయటకు వచ్చేందుకు ఇప్పటికీ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక దేవినేని అవినాష్ పేరు చెప్పి ఆయన అనుచరులు చేసే  దందాలు ఆయనకు ఇబ్బందిగా మారింది. గొడవలు, ఘర్షణలకు కారణం అయిన వ్యక్తులు దేవినేని అవినాష్ పేరును వినియోగిస్తున్నారు. అంతే కాదు దేవినేని అవినాష్ పేరు చెప్పి, ఆయన వద్ద ఉన్న కొందరు వ్యక్తులు ఆఖరికి కార్పొరేటర్లను సైతం, ఇబ్బందులకు గురి చేయటంలొ స్వపక్షంలో విపక్షంగా మారింది. అంతే కాదు అత్యంత కీలకమైన  తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై దాడి ఘటనలో కూడా దేవినేని అనుచరుల పాత్ర ఉండటంతో , టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేయటం, వారి వీడియోలు సైతం సీసీ కెమెరాల్లో చిక్కటం కూడా మైనస్ గా మారింది. టీడీపీ నేత మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై హత్యా యత్నంలో కూడా దేవినేని అవినాష్ అనుచరులు ఉండటం, గాంధీ కన్ను పోవటంతో టీడీపీకి సింపథీ వచ్చింది.


ఇది నియోజకవర్గ ముఖ చిత్రం...


ఇక నియోజకవర్గ ముఖ చిత్రానికి వస్తే టీడీపీ, వైసీపీ నేతల మధ్య పోటా పోటీగా వాతావరణం ఉంది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు మద్దతు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో గద్దెను టీడీపీ అభ్యర్థిగా గన్నవరం పంపుతారని, జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీకి సీటు వస్తుందని ప్రచారం ఉంది. అదే సమయంలో టీడీపీ నుంచి గద్దె గన్నవరం నియోజకవర్గం వెళితే, అక్కడ సీటును ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకు ఇవ్వాలని గద్దె ప్రతిపాదనలు పెడుతున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలో పరిస్దితులు ఎప్పుడు ఎలా మారతాయనేది చర్చనీయాశంగా మారింది.