KCR Vs Tamilsai :   ఏదో జరగబోతోందని ఆశించిన వారందరి ఆలోచలను తారుమారు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం సాఫీగా సాగిపోయింది.  యథావిధిగా ఏ  గవర్నరైనా ప్రభుత్వం చేస్తోన్న పనులు భేష్‌ అని ప్రసంగంలో చెప్పడం పరిపాటే. నిన్నటివరకు తగ్గేది లేదన్న తమిళిసై  బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని తూచా తప్పకుండా చదివారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్‌ గా సాగిన యుద్ధం కాంప్రమైజ్‌ తో సద్దుమణిగింది. అయితే ఇది విరామమా లేదంటే వ్యూహంలో భాగమా అన్నదే చర్చనీయాంశంగా మారింది.


బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో గవర్నర్ ! 


గతకొన్నాళ్లుగా తెలంగాణలో బీఆర్‌ ఎస్‌ వర్సెస్‌ బీజేపీ యుద్ధం నడుస్తోంది.ఈ ఇష్యూలో గవర్నర్‌ తమిళిసై కూడా ఉండటంతో వివాదం మరింత ముదిరింది. ఓ వైపు బీజేపీతో మరోవైపు గవర్నర్‌ తో యుద్ధాన్ని కొనసాగిస్తున్న బీఆర్‌ ఎస్‌ ఇక తేల్చుకోవాల్సిందే అన్న రేంజ్‌ లో రెచ్చిపోయింది. అధికారపార్టీకి ధీటుగా గవర్నర్‌ కూడా సై అనడంతో ఇక ఈ పోరు ఆగదని డిసైడ్‌ అయిపోయారు. కెసిఆర్‌, తమిళిసై తీరు చూసిన వారంతా ఎవరో ఒకరు మాత్రమే తెలంగాణలో ఉంటారన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావడం, తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం ఉండటంతో ఏం జరగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ ఆలోచనలను తలకిందులు చేస్తూ ప్రభుత్వం , గవర్నర్‌ మధ్య సయోధ్య కుదరడం, బడ్జెట్‌ ప్రసంగమంతా ప్రభుత్వానికి అనుకూలంగా సాగడంతో అందరూ షాక్‌ కి గురయ్యారు. అప్రగతి భవన్‌ వర్సెస్‌ రాజ్‌ భవన్‌ గా సాగిన పోరు ఒక్క సారిగా సద్దుమణగడం వెనక ఉన్న కారణమేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. 


వరుసగా బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తున్న దర్యాప్తు సంస్థలు


ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా కెసిఆర్‌ గళమెత్తారో అప్పటి నుంచి కాషాయం కన్నేసింది. సమయం చూసి దెబ్బకొట్టింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగుతున్న దాడులే ఈ కాంప్రమైజ్‌ కి కారణమన్న వాదన వినిపిస్తోంది. గతకొన్ని నెలలుగా ఈడీ, ఐటీ దాడులతో అధికారపార్టీపై విరుచుకుపడుతోంది బీజేపీ.  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్‌ ఎస్‌ నేతల అక్రమాలు వెలుగులోకి తెస్తామని  అలా చెప్పడం ఇలా మరుసటి రోజు నుంచే దాడులు మొదలవడం జరిగిపోయాయి.మంత్రులు మల్లారెడ్డి నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వరకు ఎవర్నీ వదల్లేదు. పార్టీకి ఆయువుపట్టైన వ్యాపార నేతలనే బీజేపీ గురి పెట్టింది. ఫలితంగా అటు వ్యాపారాలు చేసుకుంటూ ఇటు రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్న నేతల ఆర్ధిక మూలాలపై దెబ్బేసింది. విద్యాసంస్థలు, మైనింగ్‌, ఇప్పుడు రియల్‌ వ్యాపారంపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ ఎస్‌ మంత్రుల అక్రమ చిట్టా మొత్తం ఈ కేంద్రసంస్థల చేతుల్లో ఉంది. 


కవిత పేరు లిక్కర్ స్కాంలో ఉండటంతో మరింత వైరం ! 


దీనికి తోడు కూతురు కవిత కూడా లిక్కర్‌ స్కాంలో ఉండటంతో కెసిఆర్‌ సైలెంట్‌ అయ్యారన్న టాక్‌ వినిపించింది. నిన్నటివరకు ఈడీ, ఐటీ దాడులను బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు కేంద్రంగా కెసిఆర్‌ చూపించాలనుకున్నా అది ఆశించిన విధంగా లేకపోవడమే కాదు భవిష్యత్‌ లో మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతో ఆయన వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అందుకే గవర్నర్‌ తో చేతులు కలిపారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రులు చెబుతున్నా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదన్న సత్యం ప్రజలకు తెలుసునని బీఆర్‌ ఎస్‌ పార్టీ గ్రహించిందట. 


బీజేపీతో కేసీఆర్ సయోధ్య కుదుర్చుకున్నారా ?


అందుకే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ప్రస్తుతం స్వస్తి పలికి సయోధ్యకుదుర్చుకున్నట్లు రాజకీయవర్గాల్లో వినికిడి. అయితే ఈ వాదనను ఖండించే వారూ లేకపోలేదు. కెసిఆర్‌ అనుకున్న విధంగానే గవర్నర్‌ తో ప్రభుత్వ పనితీరు భేష్‌ అని చెప్పించుకున్నారని గుర్తు చేస్తున్నారు. నిన్నటివరకు బీఆర్‌ ఎస్‌ పాలన అవినీతిమయమని, అప్పుల రాష్ట్రంగా తెలంగాణని మార్చారని బీజేపీ విమర్శించింది. ఇప్పుడు ఆ పార్టీకే చెందిన  గవర్నర్‌ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పించి కెసిఆర్‌ తన రాజకీయచతురత చూపించారని చెబుతున్నారు. అంతేకాదు ఎప్పుడూ దూకుడు చూపించాలో ఎప్పుడు వెనకడుగు వేయాలో కెసిఆర్‌ కి తెలిసింత మరెవరికీ తెలియదని కూడా గుర్తు చేస్తున్నారు.