Telangana Congress Side Effects :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తన చేరికలు జరుగుతున్నాయ. బలమైన నేతలు అనుకున్న వారు వచ్చి చేరుతున్నారు. అయితే వారికి  సీట్లివ్వడానికి సిద్ధమైతే.. ఇప్పటి వరకూ  పార్టీ కోసం పని చేసిన వారు అసంతృప్తికి గురై పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  మైనంపల్లి హన్మంతరావు చేరిక కారణంగా మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఇంచార్జులు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిని రాహుల్ వద్దకు తీసుకెళ్లి.. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇప్పించినా ప్రయోజనం లేకపోియంది. అయితే వీరితోనే వలసలు ఆగే అవకాశం లేదు. ఎంత మంది చేరుతారో అంత మంది వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అసంతృప్తుల కోసం బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుందని చెబుతున్నారు. 


కాంగ్రెస్‌లో చేరికలతో  పాటే పెరుగుతున్న అసంతృప్తులు


కాంగ్రెస్‌ గెలుపు గుర్రాలు అనుకున్న వారిని పిలిచి మరీ టిక్కెట్లు ఆఫర్ చేసి పార్టీలో చేర్చుకుంటోంది. మైనంపల్లి హన్మంతరావు కోటాలో మూడు టిక్కెట్లు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు. వారికి  నాగర్ కర్నూలు, కల్వకుర్తి సీట్లను ఇస్తున్నారు. పార్టీ వీడి పోయిన భువనగిరి కాంగ్రెస్ అధ్యక్షుడు కంభం అనిల్ కు టిక్కెట్ ఆఫర్ ఇచ్చి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. ఖమ్మం నుంచి తుమ్మల, పొంగులేటి లాంటి బలమైన నేతలంతా చేరిపోయారు. కానీ అక్కడ కాంగ్రెస్ కోసం పని చేసిన వారంతా ఇబ్బందికి గురవుతున్నారు. ఇంకా బీజేపీ నుంచి కూడా ఓ బ్యాచ్ చేరబోతోందని చెబుతున్నారు. వారు చేరితే మరికొంత మంది కాంగ్రెస్ నేతలకు అసంతృప్తే మిగులుతుంది. 


కాంగ్రెస్ అసంతృప్త నేతల్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్


చేరికలతో జోష్ నింపుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అవకాశాలు కోల్పోతున్న నేతలందర్నీ ఆకర్షించేందుకు ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. మైనంపల్లిని చేర్చుకునే సమయంలో.. ఆ టిక్కెట్ కోసం ఆశలు పెట్టుకున్న నందికంటి శ్రీధర్ ను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లి భవిష్యత్‌పై భరోసా ఇప్పించారు. కానీ బీఆర్ఎస్ తిరస్కరించలేని ఆఫర్ ఇచ్చి  ఆయనను  పార్టీలో చేర్చుకుంటోంది. మెదక్ ఇంచార్జి  కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ సేవాదళ్ చైర్మన్  వంటి వారు కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. మరికొంత మంది అసంతృప్త వాదులతోనూ చర్చలు జరుగుతున్నాయి. చేరుతున్న  వారితో  పాటు పార్టీ నుంచి బయటకు వెళ్లే్ వారు కూడా ఎక్కువగానే ఉన్నారని.. కాంగ్రెస్‌ వైపు ఎవరూ మొగ్గడం లేదని  చెప్పాలనుకుంటున్నారు. 


బుజ్జగింపుల్లో విఫలమవుతున్నరా ?


కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా ఆరు నెలల కిందటి వరకూ నీరసంగా ఉన్న పార్టీకి  బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మేలు జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపించింది.  బీజేపీలో చేరికలు లేకపోగా.. బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ దక్కని వాళ్లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గెలిచే చాన్స్ ఉందనుకున్న వారందర్నీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ   వారి వల్ల ఎఫెక్ట్ అవుతున్న నేతల్ని బుజ్జగించడంలో మాత్రం విఫలమవుతున్నారు.