Nampally Court Phone Tapping Chargesheet August 15: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ కేసులో వేగంగా విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆగస్టు 15 నాటికి నాంపల్లి కోర్టులో భారీ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది. దాదాపు 600 మందికి పైగా బాధితులు, సాక్షుల వాంగ్మూలాలు , ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల కన్ఫెషన్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా పక్కా సాంకేతిక ఆధారాలతో ఈ అదనపు అభియోగపత్రాన్ని సీనియర్ అధికారులు రూ పొందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Continues below advertisement

టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేసులు

ఈ ఛార్జ్‌షీట్ దాఖలు ద్వారా దేశ చట్టపరమైన చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి నమోదు కాబోతోంది. సాధారణంగా కేసులలో ప్రయోగించే ఐపీసీ సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధంగా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛపై నిఘా పెట్టినందుకు గాను ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్  కింద అత్యంత కీలకమైన సెక్షన్లను జోడిస్తూ ఈ ఛార్జ్‌షీట్ సిద్ధం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి రక్షణ నిఘా వ్యవస్థలను రాజకీయ స్వలాభం కోసం వాడారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రాఫ్ చట్టం కింద నమోదు చేస్తున్న సెక్షన్లు నిందితులకు చట్టపరంగా పెద్ద చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

Continues below advertisement

బలమైన సాక్ష్యాధారాలను చూపించే ప్రయత్నం 

గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ అధికారులకు లభించిన సాంకేతిక ఆధారాలు , డిజిటల్ ఫోరెన్సిక్ డేటా ఈ కేసులో ప్రాణవాయువులా మారాయి. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు,  మీడియా ప్రతినిధులతో సహా నగరంలోని పలువురు ప్రముఖుల ఫోన్‌లను నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేసినట్లు సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. నిందితులు డేటాను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రికవర్ చేసిన హార్డ్ డిస్క్‌లు, కన్ఫెషన్స్ ఆధారంగా బలమైన సాక్ష్యాధారాల నెట్‌వర్క్‌ను సిట్ రూపొందించింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ కేవలం క్రిమినల్ పరిణామాలకు మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ రాజకీయ చిత్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారుల పాత్ర, పొలిటికల్ మాస్టర్‌మైండ్స్ చుట్టూ ఈ విచారణ ఉచ్చు బిగుస్తోంది. ఆగస్టు 15న ఛార్జ్‌షీట్ కోర్టు ముందుకొస్తే, ఇప్పటివరకు తెరవెనుక ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు అధికారికంగా వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

అదనపు చార్జిషీట్ లో రాజకీయ నేతల పేర్లు ఉంటాయా?

ఈ అదనపు అభియోగపత్రంలో  రాజకీయ నేతల పేర్లు ఉంటాయా అన్నది కీలకంగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారి పేర్లు గతంలో ప్రచారం లోకి వచ్చాయి.   నేరం రుజువైతే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వచ్చే శిక్షలు నిందితులకు తీవ్రమైన పరిణామాలను మిగుల్చుతాయి. ఈ కేసులో చట్టపరమైన లొసుగులు లేకుండా పక్కాగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ సీబీఐ తరహాలో సిట్ అధికారులు తమ నివేదికలను అలైన్ చేస్తున్నారు.  ఆగస్టు 15 నాటికి నాంపల్లి కోర్టులో సమర్పించబోయే అదనపు ఛార్జ్‌షీట్ తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 600 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు మరియు రికవర్ చేసిన డిజిటల్ సాక్ష్యాధారాలతో సిట్ సిద్ధం చేసిన ఈ విచారణ నివేదిక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారులకు ఉచ్చు బిగిస్తుందో లేదో వేచి చూడాలి!