రేవంత్ రెడ్డి.. ఈ పేరే ఓ ఫైర్ బ్రాండ్. కానీ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ తుస్సుమంటోంది. నాకు సీనియర్లు సహకరించడం లేదు. కోవర్టులున్నారని రేవంత్ అండ్ కో బ్యాచ్ పదే పదే సోషల్ మీడియాలో కొడై కూస్తోంది. అంతే మళ్లీ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ గా మారిపోయింది. భట్టివిక్రమార్కతో పాటు సీనియర్లపై దుమ్మెత్తి పోస్తోంది రేవంత్ టీమ్. దీంతో సీనియర్లంతా ఒక్కటయ్యారు. అసలు కోవర్టు రేవంత్ రెడ్డే అంటూ ఎగ్జాంపుల్ తో సహా వివరిస్తున్నారు. 


2014లో గెలిచిన 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, అంతేకాదు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్. ఆ 15 మంది తెలుగుదేశం శాసనసభ్యులు పార్టీ మారడానికి కారణం ఎవరో చెప్పండి రేవంత్ రెడ్డి సాబ్ అంటూ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అంటే రేవంత్ కూడా కోవర్టే కదా అంటున్నారు.


Also Read: Hyderabad Mayor: హైదరాబాద్‌లో BRS Vs BRS - మేయర్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు


2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరిప్రియ నాయక్, కందాళ ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలకు టికెట్లు ఇప్పించింది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. మరీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంలో రేవంత్ పాత్ర ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సబితా సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లడం కూడా రేవంత్ పాత్ర ఉందా అని నిలదీస్తున్నారు సీనియర్లు.


ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. వెనుక ఎమ్మెల్యేలు ఉండకపోయినా..  రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు ఆదరించి పార్టీలోకి ఆహ్వానించారు. నిజంగానే కాంగ్రెస్ లో సీనియర్లు అడ్డుకుంటే రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేవాడేనా? కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోతే  మల్కాజిగిరి ఎంపీ సీటు సీనియర్ల సహకారం లేనిదే వచ్చిందా? నువ్వు అంటున్నట్టు సీనియర్లు అంతా మూకుమ్మడిగా అడ్డుపడితే నీకు పీసీసీ చీఫ్ పోస్ట్ వచ్చేదా? అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు.


రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారింది నిజం కాదా? బీజేపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలోకి జంపయ్యాడు. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు లేదని..దిక్కులేక కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. ఇలా పూటకో పార్టీ మారి అవకాశవాద రాజకీయాలు చేసింది ఎవరు?. పార్టీని ఓటుకు నోటు కేసులో ఇరికించి పార్టీ నాశనం చేసింది ఎవరు? ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర ఎవరిది? టీడీపీలో పాదం మోపి సర్వనాశనం చేసింది ఎవరు? అంటూ నానా మాటలు అంటున్నారు. 


Also Read: Telangana Congress : రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్ - కాస్త మెత్తబడిన సీనియర్లు ! సమావేశం లేనట్లే ?


కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశంలో కూడా అధికారం లేదు అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా మోదీకి కోవర్టులేనా?  తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతున్నారని ఉదాహరణలతో సహా చెప్తున్నారు.