Will there be any changes in the Telangana cabinet: తెలంగాణ మంత్రిర్గంలో మార్పు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. దీని కోసం హైకమాండ్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. హైకమాండ్ వద్ద రేవంత్ కు ఉన్న పలుకుబడిని బట్టి చూస్తే.. అనుమతి లభించే అవకాశం ఉందని అనుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలపైనే నెలకొంది. 

Continues below advertisement

హస్తినలో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూపు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నప్పటికీ, కేబినెట్ కూర్పులో మాత్రం గత ఎన్నికల సమీకరణాల ప్రభావం కొంతవరకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వంపై పట్టు పెంచుకోవడానికి, పాలనలో వేగం పెంచడానికి తనకు అత్యంత సన్నిహితులైన వారితో పాటు, పనితీరులో దూకుడు ప్రదర్శించే నేతలకు చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూనే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన చేయాలని రేవంత్ యోచిస్తున్నారు.

Continues below advertisement

రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? 

ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలను ఆయన ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే, రాహుల్ గాంధీ నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ లభించిందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సాధించిన ఫలితాలు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్న తీరును చూస్తే, హైకమాండ్ వద్ద ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా ఈసారి రేవంత్ కోరుకున్నట్లుగానే మార్పులకు అనుమతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.  

అసెంబ్లీ తర్వాతే అసలు క్లారిటీ 

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు కావచ్చని పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టిన మంత్రులకు ప్రమోషన్లు, వివాదాల్లో ఉన్న లేదా ఆశించిన స్థాయిలో రాణించని వారికి ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సెషన్ పూర్తి కాగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చనే ప్రచారం గాంధీ భవన్‌లో జోరుగా సాగుతోంది. ఖాళీగా ఉన్నది ఒకే మంత్రి పదవి. కానీ కొంత మందిని తప్పిస్తే మరికొంత మందికి అవకాశం లభిస్తుంది.  ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఒత్తిడి రేవంత్ రెడ్డిపై ఉంది. 

పట్టుదల వెనుక వ్యూహం 

రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉండటానికి కారణం కేవలం మార్పులు చేయడం మాత్రమే కాదు; పార్టీపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కూడా. హైకమాండ్ అనుమతితో తనకిష్టమైన వారిని కేబినెట్‌లోకి తీసుకోగలిగితే, పార్టీలో తనకు ఎదురులేదని నిరూపించుకోవచ్చనేది ఆయన వ్యూహం. ఒకవేళ ఇద్దరు ముగ్గురు సీనియర్ మంత్రుల శాఖలను మార్చగలిగితే, పాలనా యంత్రాంగంపై తన పట్టు మరింత బిగుస్తుంది.