తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ 55 నియోజకవర్గాలకు పేర్లు ప్రకటించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై కాషాయ పార్టీ అధిష్ఠానం గురువారం తెలంగాణ నేతలతో భేటీ అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల బాధ్యులు సునీల్‌ భన్సల్‌, తరుణ్‌ చుగ్‌, ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశంలో పాల్గొన్నారు. 


ర్యాలీలు ఎక్కడెక్కడ నిర్వహించాలి


సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏయే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి ? అభ్యర్థుల బలాబలాలు ఏంటి ? ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పాల్గొనే ప్రచార ర్యాలీలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కసరత్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్బంగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై చర్చించింది. నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి వర్గం అమోదముద్ర వేసింది. పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించినట్లు తెలుస్తోంది. 


గజ్వేల్ నుంచి బరిలోకి ఈటల ?


గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో అదే స్థానం నుంచి ఢీ కొట్టాలని ఈటల రాజేందర్ పట్టుదలగా ఉన్నారు. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్, అంబర్ పేట నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆర్మూరు నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ధర్మపురి నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్, కాంగ్రెస్


మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మెజార్టీ సీట్లు సిట్టింగ్ లకు ఇవ్వడంతో ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. పార్టీ నేతలు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొంటున్నారు. అధికార పార్టీ అక్రమాలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది.