Tejashwi Yadav declares himself CM candidate: ఎన్నికలు జరగనున్న బిహార్లో కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ ‘ఓటరు అధికార్ యాత్ర’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి అర్రా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన యాత్రలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ప్రధాన నేత తేజస్వి యాదవ్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి..ఇప్పటివరకు రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ రెండూ కూటమి బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ సమక్షంలోనే తానే సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. కూటమి సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా.. రాహుల్ సమక్షంలోనే తేజస్వీ తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకోవడంతో ఇక ఖరారైనట్లేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. తేజస్వి వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలపడం మరింత బలాన్ని చేకూరుస్తోంది.
సీఎం నితీష్పై విమర్శలు భారీగా జనం హాజరైన ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు పథకాలను ప్రవేశపెట్టకుండా తన విధానాలను ఆయన ‘కాపీ’ చేస్తున్నారని ఆరోపించారు. నితీష్ కుమార్ ‘కాపీకాట్ సీఎం’ అని సంబోధించారు. ‘మీకు అసలు ముఖ్యమంత్రి కావాలా లేదా నకిలీ ముఖ్యమంత్రి కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘ఈ తేజస్వి ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వం వెనుకబడి ఉంది’ అని అన్నారు.
అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలుఎన్నికల యుద్ధానికి బిహార్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ ఇంకా అధికారిక షెడ్యూల్ను ప్రకటించనప్పటికీ.. అక్టోబర్ లేదా నవంబర్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొనడంలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇండియా బ్లాక్ కూటమి అర్రాలో యాత్ర నిర్వహించింది. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే ఉద్యమంగా ఈ యాత్రను నేతలు అభివర్ణించారు. నితీష్ ప్రభుత్వంలో ప్రజా హక్కులకు ముప్పు వాటిల్లుతోందని, తమ హక్కులను పరిరక్షించుకోవాలని అఖిలేష్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈసారి తెలివిగా ఓటు వేస్తారు‘తేజస్వి ఈ యాత్రను నిర్వహించినందుకు నేను అభినందిస్తున్నా. బిహార్ ప్రజల హక్కులు హరిస్తున్నాయి. వీటి గురించి తేజస్వి ప్రజలకు అవగాహన కల్పిస్తుండడం అభినందనీయం. ఈసారి బిహార్లో సామరస్యం గెలుస్తుంది. ప్రజలు తమ భవిష్యత్ను నిర్మించుకునేందుకు ఈసారి తెలివిగా ఓటు వేయనున్నారు’ అని అఖిలేష్ పేర్కొన్నారు.
తేజస్వికి పూర్తిగా మద్దతిస్తున్నాడిప్యూటీ సీఎంగా తేజస్వి రికార్డును, ఉపాధి కల్పనపై ఆయన చేసిన కృషిని మాజీ సీఎం ప్రశంసించారు. నాడు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ రికార్డుస్థాయిలో ఉద్యోగాలను సృష్టించారని, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆ పనిని కొనసాగిస్తారని బిహార్ ప్రజలు విశ్వసిస్తున్నారని అని అన్నారు. తేజస్వి నిజంగా కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అని జనం ప్రశ్నించగా.. తన పూర్తి మద్దతు అందిస్తున్నట్లు అఖిలేష్ పేర్కొన్నారు. తన ప్రచారానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.