AP Alliance Politics:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం అత్యంత ఐక్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పర సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి ఎజెండాతో పాలన అందిస్తున్నారు. ప్రభుత్వ వేదికలపై, సమీక్షా సమావేశాల్లో, మీడియా ముందూ ఇరువురి నేతల మధ్య చక్కని సమన్వయం కనిపిస్తోంది. అయితే, భౌతిక ప్రపంచంలో సజావుగా సాగుతున్న ఈ పొత్తు.. డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. బయట నేతలు చూపుతున్న కలుపుగోలుతనం, క్షేత్రస్థాయి సోషల్ మీడియా కార్యకర్తల మధ్య మచ్చుకైనా కనిపించడం లేదనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Continues below advertisement

సఖ్యతకు సోషల్ మీడియానే కీలకం

ప్రస్తుత ఆధునిక రాజకీయాన్ని సోషల్ మీడియా శ్రేణులే ఎక్కువ భాగం శాసిస్తున్నాయి. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాలను పరిశీలిస్తే.. పార్టీ సిద్ధాంతాల కంటే సినీ అభిమానం, హీరోల ఇమేజ్ కాపాడుకోవడమే ప్రధాన ఎజెండాగా మారుతోంది. రాజకీయ సోషల్ మీడియా ప్రతినిధులుగా చలామణి అవుతున్న వారిలో అత్యధికులు మూలాల్లో సినీ అభిమానులే కావడమే దీనికి కారణం. దాంతో ప్రతి చిన్న అంశమూ నందమూరి వర్సెస్ మెగా కాంపౌండ్ ఫ్యాన్ వార్‌గా రూపాంతరం చెందుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ డిజిటల్ శత్రుత్వం ఏమాత్రం తగ్గకపోగా రోజుకో కొత్త వివాదంతో రగులుతూనే ఉంది.

Continues below advertisement

కొరియన్ కనకరాజుతో మరింత వివాదం

కొరియన్ కనకరాజు సినిమా వివాదం ఈ సోషల్ మీడియా వార్‌ను మరింత పరాకాష్ఠకు చేర్చింది. అందులో మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలోని ఐకానిక్ డైలాగ్ “అమెచ్యూరిష్ స్ట్రోక్స్”ను స్పూఫ్ చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహానాయకుడిని కించపరిచే కుట్ర జరిగిందని, అది మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రంలో ఉండటంతో కావాలనే చేశారంటూ ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు, సినిమా రంగంలో క్లాసిక్ డైలాగ్‌లను సరదాగా వాడటం సాధారణమేనని, దీన్ని రాజకీయ రంగు పులుమడం అనవసరమని జనసేన లేదా మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు.

నారా లోకేష్ స్పందించాలంటున్న టీడీపీ సోషల్ మీడియా సైనికులు

ఈ రచ్చ కేవలం సినీ వివాదానికే పరిమితం కాకుండా, పొలిటికల్ లీడర్ల ఇమేజ్‌ను టార్గెట్ చేసే స్థాయికి వెళ్లడమే ఇక్కడ గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను కించపరుస్తుంటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదంటూ కొంతమంది వ్యూహాత్మకంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా మొదలైన ఈ పోరులోకి లోకేష్, పవన్ కళ్యాణ్ నేరుగా లాగాలనుకునే రాజకీయం మరింత వేడెక్కింది. పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, ఇరు పార్టీల అధినేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విద్వేషపూరిత పోస్టులు పెట్టడం సర్వసాధారణంగా మారింది.

సీరియస్‌గా తీసుకోలేరు.. లైట్ తీసుకోలేరు!

ఈ పరిస్థితి ఇప్పుడు టీడీపీ, జనసేన అధిష్టానాలకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో, నాయకత్వ స్థాయిలో సఖ్యత ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో నిరంతరం సాగుతున్న ఈ సైబర్ వార్ వల్ల శ్రేణుల మధ్య క్రమంగా శత్రుత్వం పెరిగే ప్రమాదం ఉందని   హెచ్చరిస్తున్నారు. వీటిని కంట్రోల్ చేయడం ఇటు లోకేష్‌కు, అటు పవన్ కళ్యాణ్‌కు అంత తేలికైన విషయమేమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్స్‌పై అధినేతలు బహిరంగంగా స్పందిస్తే, ఆ చిల్లర వివాదాలకు మరింత ప్రచారం కల్పించినట్లవుతుంది. సైలెంట్‌గా ఉంటే ఇది మరింత పెరిగి పెద్దదయ్యే ప్రమాదం ఉంది.

కానీ చల్లబరచాల్సిందే! 

  ప్రజాస్వామ్యంలో పొత్తులు, ప్రభుత్వాలు సుస్థిరంగా కొనసాగాలంటే క్షేత్రస్థాయిలోనే కాదు, డిజిటల్ సైన్యాల మధ్య కూడా క్రమశిక్షణ, అవగాహన అవసరం. సినిమా ఫ్యాన్ వార్స్‌ను రాజకీయాలకు అంటగట్టడం వల్ల కూటమి ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అధిష్టానాలు తక్షణమే రంగంలోకి దిగి, తమ సోషల్ మీడియా వింగ్‌లను క్రమశిక్షణలో పెట్టకపోతే.. డిజిటల్ వేదికలపై సాగుతున్న ఈ నిశ్శబ్ద సమరం భవిష్యత్తులో అసలు రాజకీయాన్నే ప్రభావితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.