ఆ ముగ్గురితో కలిసేది లేదంటూ బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు వారంతా తన వెంట తిరిగి ఇప్పుడు తనను కాదంటున్నారు. కాదన్నా ఫర్వాలేదు.... ఏకంగా నెగిటివ్ కామెంట్స్ చేయటంపై కేశినేని సీరియస్ గా ఉన్నారు.


బెజవాడ ఎంపీ కేశినేని నాని చాలా సైలెంట్‌గా ఉండే వ్యక్తి. చాలా వరకు ఆయన చేతలు మాత్రమే పని చేస్తాయంటారు. నోరు మాత్రం వినిపించదని కామెంట్ చేస్తారు. అలాగని తనను కావాలని టచ్ చేస్తే మాత్రం దబిడి దిబిడే. టచ్‌ చేసిన వాళ్లతోపాటు పార్టీ అధినాయకత్వానికి కూడా సెగ తగిలేలా విమర్శలతో రెచ్చిపోతారు కేశినేని నాని. 


కొన్ని రోజులుగా కేశినేని నాని చేస్తున్న కామెంట్స్‌ తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారంలో ఉన్నా, లేకపోయినా కేశినేని నాని మాత్రం ఒకేలా కనిపిస్తారు. పార్లమెంట్ సభ్యుడిగా తన పరిధిలోని నియోజకవర్గాలకు అవసరమైన నిధులను ఖర్చు చేస్తారు. ఆ నియోజకవర్గంలో పక్క పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా అవసరం అయిన నిధులు ఇచ్చి పని చేయిస్తారు. అదే సమయంలో పొలిటికల్‌గా తనపై కామెంట్స్ చేస్తే మాత్రం ఆయన ఇచ్చే పంచ్‌లకు ఎవరైనా సరే షాక్ కు గురి కావాల్సిందే. ఈ విషయంలో ప్రతిపక్షాల కన్నా సొంత పార్టీకి చెందిన నేతలే బాధితులుగా మిగులుతున్నారు. 


ఆ ముగ్గురు అంటూ కామెంట్స్..


తాజాగా తెలుగు దేశం పార్టీలో ముగ్గురు నేతల గురించి కేశినేని నాని చేసిన కామెంట్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమా, స్వయాన తన సోదరుడు అయిన కేశినేని చిన్నిపై కేశినేని నాని తీవ్ర కామెంట్స్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ముగ్గురు నేతలను కలుపుకొని వెళ్ళే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. కొన్ని రోజులుగా రగులుతున్న రాజకీయం.  


అధికారంలో ఉండగా దేవినేని హాల్ చల్..


అధికారంలో ఉండగా మంత్రిగా పని చేసిన దేవినేని ఉమాకు ఎంపీగా ఉన్న కేశినేని నానికి మధ్య విభేదాలు వచ్చాయి. చంద్రబాబు వద్దకు వెళ్ళనీయకుండా ఉమా అడ్డుకున్నారనే అసహనం అప్పట్టి నుంచే కేశినేని నాని మనస్సులో ఉంది. ఆ తరువాత అదే పంథాను దేవినేని ఉమా కొనసాగించటం,పార్లమెంట్ సభ్యులను చంద్రబాబు వద్దకు వెళ్ళనీయకుండా,కేంద్రం వద్ద నుంచి వచ్చే సమాచారాన్ని అడ్డుకోవటం, వక్రీకరించారనే ఆగ్రహం కేశినేని నానిలో ఏర్పడింది. ఆ తరువాత కూడా కొన్ని సందర్బాల్లో కేశినేని ఎదురు పడినా దేవినేని ఉమా ముఖం తిప్పుకొని వెళ్ళటం, దేవినేని ఉమా ప్రతినిధ్యం వహించిన మైలవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించకుండా, స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకుండా పని చేయటంతో ఇరువురు నేతల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగింది. 


దేవినేని ఉమ, కేశినేని నాని మధ్య ఏర్పడిన గ్యాప్‌ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉండగా పార్టీకి ఎదురు గాలి వీస్తున్న విషయాన్ని చంద్రబాబుకు వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకోవటంలో దేవినేని కీలకంగా వ్యవహరించారని,దాని కారణంగానే పార్టీ దారుణంగా ఓటమి పాలైందని ఎంపీ కేశినేని గతంలో కూడా అనేక స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు.


దేవినేని ఉమకు తోడుగా ఇప్పుడు చిన్ని, బుద్దా వెంకన్న వచ్చారు. ఇప్పటి వరకు బెజవాడలో టీడీపీ అంటే కేశినేని నాని అన్నట్లుగా ఉంది. పవర్ పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కూడా కేశినేని నానినే బెజవాడ టీడీపీ ఖర్చలు భరించారు. పార్టీ కార్యాలయం కూడా లేకపోవటంతో కేశినేని భవన్‌నే అర్బన్ పార్టీ కార్యాలయంగా మార్చారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అదే కార్యాలయంలో పని చేశారు. 


గత సాధారణ ఎన్నికల్లో బుద్దా వెంకన్న,నాగుల్ మీరా కూడా కేశినేని నానిని వ్యతిరేకించి బయటకు వచ్చారు. బెజవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో కేశినేని నానిని బుద్దా, నాగుల్ మీరా వర్గం వ్యతిరేకించింది. జలీల్ ఖాన్ కుమార్తెకు కేశినేని నాని సీటు ఇప్పించడంపై నానికి వ్యతిరేకంగా వీళ్లు కామెంట్స్ చేశారు. 


తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఈ రెండు వర్గాల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో కేశినేనికి వ్యతిరేకంగా నాగుల్‌మిరా, బుద్దా వెంకన్న పని చేయటంతో బెజవాడ కార్పోరేషన్‌లో టీడీపీ ఘోరంగా పరాజయం చవి చూసింది. కేశినేని చిన్ని వ్యవహరం అందరికీ తెలిసిందే. తనకు తెలియకుండా తన ఎంపీ స్టిక్కర్‌ను దుర్వినియోగం చేశారని, ఏకంగా తన సోదురుడిపైనే నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఇరువురు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ హాట్ హాట్‌గా నడిచాయి. 


ఇలా ఇగోలతో మొదలైన వార్‌ ఇప్పుడు ముదిరి పాకాన పడింది. దీంతో వాళ్ల ముగ్గురికి టికెట్స్ ఇస్తే మాత్రం తాను సహకరించబోనంటూ కామెంట్ చేశారు. తనకు సీట్‌ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఏం చేయబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.