Kanakamedala: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన బంధువుల అండదండలతో భోగాపురం మండలంలో సీఎస్ జవహార్ రెడ్డి 800 ఎకరాల భూములు దోచేశారని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపిస్తుంది. జీవో నంబర్ 596 ద్వారా డీ ఫాం పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ జవహార్ రెడ్డి బుకాయిస్తున్నారని..  పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  భూ దందాపై ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని సీబీఐ విచారణ జరపాలని.. ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


సీఎస్ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు 
ఏపీ సీఎస్‌ జవహార్ రెడ్డి తన అధికారాలను, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఎలక్షన్ కమిషన్ ను కోరారు.  ఆయన్ను తొలగించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కనకమేడల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆ లేఖలో ‘‘ఎన్నికల నియమావళిని సీఎస్‌ జవహర్‌రెడ్డి   ఉల్లంఘించారు. ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్ని పెద్ద ఎత్తున తన కొడుకు, బినామీల పేరిట కొనుగోలు చేశారు. దాదాపు 800 ఎకరాలను కొనుగోలు చేశారు. భూముల రిజిస్ట్రేషన్‌ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు. కౌంటింగ్‌ సజావుగా జరగడం పై విపక్షాలకు అనుమానం ఉంది.  ఓట్ల లెక్కింపుపై ప్రభావితం చూపే అవకాశం ఉంది’ అంటూ లేఖలో రాసుకొచ్చారు. 


సీఎస్ రూ.2 వేల కోట్ల విలువైన భూములు దోచినా చర్యల్లేవు : బోండా ఉమా 
ఎన్నికల టైంలో అధికార దుర్వినియోగం గురించి ఎన్నికల అధికారికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ విమర్శించారు.  సీఎస్ జవహార్ రెడ్డి అక్రమాలపై రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు బోండా తెలిపారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూ దోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా ఆయన ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.  జవహర్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా  వెంటనే తనపై వచ్చిన  ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.  డీఫాం పట్టాలన్నీ సీజ్ చేసి, కలెక్టర్ సహా, సంబంధిత అధికారులందరిపై విచారన జరిపించాలన్నారు.  ఆధారాలను చూపిస్తే విచారణ కోరకుండా, ఆరోపణలు చేసిన వారిని జవహార్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.