Chandrababu :    తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని  జిల్లా కలెక్టర్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 12 డైరెక్టర్ పోస్టులకు నేడు జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్ల కారణంగా పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశఆరు.  తిరుపతి టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో పోలీసులతో కుమ్మక్కైన అధికార వైఎస్సార్సీపీ అక్రమాలకు పాల్పడిందన్నారు.  వైఎస్ఆర్‌సీపీ మద్దతు లేని అభ్యర్థులపై  అభ్యర్థులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని..  పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు పోటీలో ఉన్న పులిగోరు మురళీ కృష్ణా రెడ్డి, బుల్లెట్ రమణ,జెబి శ్రీనివాసులుపై కేసులుపెట్టారని ఆరోపించారు. వైసీపీ మద్దతు  ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా నకిలీ ఐడీ కార్డ్‌లతో దొంగ ఓట్లు వేయించారని..  ఎన్నికల్లో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన పి వలముని అనే పోటీదారుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విస్మయకమన్నారు.  350 కోట్ల వార్షిక టర్నోవర్ తో 290 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్న బ్యాంక్ పై వైఎస్ఆర్‌సీపీ నేతల కన్ను పడిందని విమర్శించారు.  బ్యాంకు సభ్యుల హక్కులను కాపాడేందుకు ఈరోజు పోలింగ్ ప్రక్రియను రద్దు చెయ్యాలని నిష్పక్షపాతంగా మరో రోజు ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.






తిరుపతి  టౌన్ బ్యాంక్ అక్రమాలపై టీడీపీ నేతలు ఉదయం నుంచి వివిధ రకాల వీడియోలు ప్రదర్శిస్తున్నారు. దొంగ ఓట్లు వేస్తున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 



ఎలాంటి ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ అడ్డదారులు తొక్కుతుందని, టీడీపీ నేతలను గృహ నిర్బంధించి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలు ఎందుకని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంది. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బ్రతుకు మరోసారి బయటపడింది. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఇక ఎన్నికలెందుకని.. మూడేళ్లుగా దోచుకున్న డబ్బును అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారని విమర్శించారు.