Did Tammineni Veerabhadram weaken the Telangana CPM:  తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, రాజకీయాలను శాసించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్  సీపీఎం ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతోంది.  పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో వరుస పరాజయాలు ఆ పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు రావడానికి కారణం అయ్యాయి. ఇటీవలి కాలంలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తమ్మినేని వీరభద్రాన్ని  ఆపార్టీ హైకమాండ్  అభిశంసించడం.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తోంది.

అస్తిత్వ పోరాటంలో సీపీఎం

తెలంగాణ రాజకీయాల్లో సీపీఎం ప్రస్థానం ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కింగ్ మేకర్‌గా ఉన్న ఈ పార్టీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సున్నం రాజయ్య రూపంలో భద్రాచలం నుండి ఒకే ఒక సీటు సాధించిన సీపీఎం, ఆ తర్వాత 2018 మరియు 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. గత పదేళ్లుగా చట్టసభల్లో గొంతుక లేకపోవడం ఆ పార్టీ కేడర్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నామని చెబుతున్నా, అవి ఓట్లుగా మారకపోవడం ఆ పార్టీ వైఫల్యానికి అద్దం పడుతోంది.

గ్రామస్థాయిలోనూ  క్యాడర్ నిర్వీర్యం 

కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఎంకు గట్టిక్యాడర్ ఉంటుంది. అయితే రాను రాను ఆ క్యాడర్ కూడా మారిపోతోంది.  దానికి లోకల్ పోల్సే సాక్ష్యం.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీపీఎం పరిస్థితి దయనీయంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వందలాది వార్డుల్లో పోటీ చేసినా, కేవలం   10-12  వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. అటు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒకప్పుడు వందలాది సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న పార్టీ, గత ఎన్నికల్లో కేవలం అతి తక్కువ గ్రామ పంచాయతీలకే పరిమితమైంది. నల్గొండ, ఖమ్మం వంటి తమ బలమైన జిల్లాల్లో కూడా ప్రాతినిధ్యం నామమాత్రంగా మారిపోవడం పార్టీ పతనానికి నిదర్శనం.

పార్టీని నాశనం చేశారని తమ్మినేని వీరభద్రంపై అభిశంసన

 తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పార్టీ రాజకీయంగా ఎదగకపోగా, ఉన్న ఉనికిని కూడా కోల్పోయిందని కేంద్ర కమిటీ భావిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో, కొత్త రక్తాన్ని ఎక్కించడంలో ఆయన విఫలమయ్యారని, పైగా పార్టీని తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం వాడుకున్నారని విమర్శలు వచ్చాయి. సిద్ధాంతాల కంటే ముఠా రాజకీయాలకే ప్రాధాన్యత పెరగడం వల్ల సామాన్య ప్రజలు పార్టీకి దూరమయ్యారు.  అందుకే ఆయనను  సొంత పార్టీ అభిశంసించింది.  ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో, మరో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుల కోసం వెంపర్లాడటం వల్ల సీపీఎం  సొంత ఓటు బ్యాంకును. నిలబెట్టుకోలేకపోయింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల కేడర్ కూడా ఇతర పార్టీల వైపు మళ్ళింది. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో సీపీఎం విఫలమైంది. నేటితరం రాజకీయాల్లో మారుతున్న సోషల్ మీడియా సమీకరణాలను, ఆధునిక ప్రచార పద్ధతులను అందిపుచ్చుకోవడంలో పాతకాలపు పద్ధతులే ఆ పార్టీని దెబ్బతీశాయి.

తెలంగాణలో కోలుకోవడం అసాధ్యమేనా?

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి బలమైన శక్తుల మధ్య సీపీఎం వంటి  పార్టీలు మనుగడ సాగించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. పార్టీ అంతర్గతంగా చీలిపోయి ఉండటం, నాయకత్వంపై నమ్మకం సడలడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కుప్పకూలింది. పార్టీ కార్యకర్తలు కూడా ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ రక్షణ లేకపోవడంతో ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ దశలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టే శక్తివంతమైన నాయకత్వం ప్రస్తుతం ఆ పార్టీలో కనిపించడం లేదు.   సీపీఎం తెలంగాణలో కోలుకోవడం ఇక దాదాపు అసాధ్యమనే అనిపిస్తోంది. కేవలం గతకాలపు వైభవాన్ని నెమరువేసుకోవడం తప్ప, భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికలు ఆ పార్టీ దగ్గర లేవు. తమ్మినేని వంటి సీనియర్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని ప్రక్షాళన చేయాలనుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన ఏ రాజకీయ పార్టీ అయినా మళ్లీ పుంజుకోవడం చరిత్రలో చాలా అరుదు. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం తెలంగాణలో ఒక నామమాత్రపు శక్తిగా మిగిలిపోయే  పరిస్థితి కనిపిస్తోంది.