Ganta Resign Letter Story :  మూడు రాజధానుల కోసం అంటూ వశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఆయన లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదు. దాన్ని స్పీకర్‌కు కూడా  పంపలేదు. నాన్ పొలిటికల్ జేఏసీకి ఇచ్చారు. ఈ రాజీనామా రాజకీయమా.. లేకపోతే ఇంకేదైనా వ్యూహమా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ధర్మశ్రీ చేసిన రాజకీయం.. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా వ్యవహారమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు లేఖ స్పీకర్ వద్దనే ఉంది. ఉపఎన్నిక  తేవాలనుకుంటే.. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. 


 గంటా ఎమ్మెల్యే రాజీనామా లేఖ స్పీకర్ వద్ద ! 
 
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. మొదట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటైన జేఏసీకి చేతిరాతతో రాజీనామా లేఖ రాసిచ్చారు. తర్వాత నిబంధనల ప్రకారం స్పీకర్ ఫార్మాట్‌లో రాసిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అసెంబ్లీకే గంటా శ్రీనివాసరావు హాజరు కావడంలేదు.  స్టీల్ ప్లాంట్ నుప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రం తీసుకున్నప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. అయితే మొదట ఆయన రాసిన లేఖ ఫార్మాట్‌లో లేదన్న విమర్శలు రావడంతో ..తర్వతా ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇచ్చారు. తర్వాత గంటా శ్రీనివాసరావు ఓ సారి ఆముదాల వలస వెళ్లి స్పీకర్‌తో సమావేశమయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే ఇంత వరకూ స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.   ఆయన పదే పదే స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండటంలేదు. దీంతో  ఆయన కోర్టుకెళ్లాలని కూడా అనుకున్నారు. కానీ రాజీనామా ఆమోదించడం..ఆమోదించకపోవడం స్పీకర్ పరిధిలోనిది కాబట్టి... వెనుకడుగు వేశారు. నిజానికి గంటా రాజీనామాను ఆమోదించడం స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిమిషం పని. కానీ ఎందుకో కానీ ఆయన నిర్ణయం తీసుకోవడం లేదు. 


గంటా రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే ఉపఎన్నిక!
  
ఒక వేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే.. ఆరు నెలల్లో ఉపఎన్నికలు వస్తాయి. మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీ కోరుకున్నట్లుగా ప్రజాభిప్రాయం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇతరులు రాజీనామాచేయాల్సిన అవసరం లేదు. అయితే స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు కాబట్టి ఆ అంశంపై ఎన్నికలు జరిగితే ఇబ్బందేనని వైఎస్ఆర్‌సీపీ భావిస్తున్నట్లుగా ఉంది.  ఈ కారణంగానే రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు. రాజీనామా ఆమోదించకపోయినా .. గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా... మూడు రాజధానుల అంశాన్నే వైఎస్ఆర్‌సీపీ ఎక్కువగా ప్రస్తావిస్తోంది.  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినందన విశాఖలో దుమ్మురేపే విజయం వస్తుందని వైసీపీ చెబుతోంది. కానీ అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎందుకు కాలదన్నుకుంటోందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. 


మూడు రాజధానుల పోరాటంలో సీరియస్ నెస్ లేకపోతే ప్రజలూ పట్టించుకోరు !


మూడు రాజధానుల కోసం వైసీపీ నేతలు చేస్తున్న పోరాటంలో సీరయస్ నెస్ లేకపోతే ప్రజూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. కరణం ధర్మశ్రీ  ఇచ్చిన రాజీనామా లేఖ పూర్తిగా తేడాగా ఉంది. స్పీకర్ ఫార్మాట్‌లో లేదు.  నిజంగా ఆమోదించాలని స్పీకర్ అనుకున్నా సాధ్యం కాదు. కొత్త లేఖ పంపాల్సిందే. అయితే వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని అందుకే ఇలాంటి గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు సహజంగానే వస్తాయి.  పూర్తి స్థాయిలో నిబందనలకు అనుగుణంగా ఉన్న గంటా రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతల రాజకీయాలేంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది.