Telangana CM National Politics:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇటీవల జాతీయ వేదికలపై  దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని అత్యంత అగ్రెసివ్‌గా వినిపిస్తూ దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు. ముఖ్యంగా ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన  , కేంద్రం నుంచి వచ్చే నిధులు ,  పన్నుల పంపిణీలో జరుగుతున్న అసమానతలపై ఆయన ఎక్కుపెట్టిన విమర్శలు జాతీయస్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి.  మేము కేవలం పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సలాం కొట్టే ద్వితీయ శ్రేణి పౌరులం కాబోం  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేదన మాత్రమే కాదు.. ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

జాతీయ పార్టీ సీఎం  ప్రాంతీయ సెంటిమెంట్ 

ఒక జాతీయ పార్టీ  తరఫున ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలాంటి ప్రాంతీయ సెంటిమెంట్‌ను, ముఖ్యంగా ఉత్తరాది వర్సెస్ దక్షిణాది వాదాన్ని లేవనెత్తడం వెనుక కాంగ్రెస్ పార్టీ మారుతున్న అంతర్గత రాజకీయ సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని ఎన్నికల సరళిని పరిశీలిస్తే, ఉత్తరాది రాష్ట్రాలలో   కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోతోంది. అదే సమయంలో కర్ణాటక, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు కాంగ్రెస్‌కు ప్రధాన ఆర్థిక, రాజకీయ వనరులుగా మారాయి.  ఉత్తరాదిపై ఆశలు వదులుకోకపోయినా, తమకు పెట్టని కోటగా మారిన దక్షిణాదిని మరింత పటిష్టం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి చేత కాంగ్రెస్ అధిష్ఠానం ఈ తరహా వాయిస్ వినిపిస్తోందని భావించవచ్చు.

Continues below advertisement

రేవంత్ రాజకీయంతో కాంగ్రెస్‌కు దక్షిణాదిన మేలు

ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పిల్లర్  గా రూపాంతరం చెందుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతాయని రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వంటి ఇతర దక్షిణాది నేతలకు లేఖలు రాస్తూ అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేయడం ద్వారా ప్రాంతీయ పార్టీల కంటే తానే ఈ వాదాన్ని బలంగా మోయగలనని నిరూపించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' అంటే 50% సీట్లను జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం ఆధారంగా కేటాయించాలనే డిమాండ్ — ఆయన పొలిటికల్ మెచ్యూరిటీని చూపిస్తోంది. దీనివల్ల ఆయన కేవలం గుడ్డిగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదని, ఒక నిర్మాణాత్మకమైన ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది అటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇమేజ్‌ను దెబ్బతీయకుండా, ఇటు దక్షిణాది ప్రయోజనాలను కాపాడే సమతుల్య వ్యూహంగా ఉపయోగపడుతోంది.

మరింత పెరగనున్న దక్షిణాది సెంటిమెంట్ 

భవిష్యత్ రాజకీయాల కోణంలో చూస్తే, ఈ 'దక్షిణాది సెంటిమెంట్' రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఢిల్లీ పాలకుల నిర్ణయాల వల్ల దక్షిణాది రాజకీయంగా అణగారిపోతుందనే భయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయవచ్చు.  అయితే, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఈ వ్యూహం రెండు అంచుల కత్తి లాంటిదే. దక్షిణాదిలో ఈ వాదం మైలేజ్ ఇచ్చినప్పటికీ, ఉత్తరాది రాష్ట్రాలలో దీనివల్ల కాంగ్రెస్ మరింత రక్షణలో పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది హక్కుల కోసం పోరాడే ఒక 'ఫైర్ బ్రాండ్' లీడర్‌గా రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు.