Revanth and KCR are getting ready for competitive public meetings in Gajwel:  ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ పెట్టుకుందాం అని కేసీఆర్ ఇటీవల తన ను కలిసిన పార్టీ నేతలకు చెప్పారు. ఆ బహిరంగసభ గజ్వేల్‌లోనే అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా తేదీ ఖరారు చేయలేదు. కాంగ్రెస్ కూడా గజ్వేల్ లోనే బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. కులగణనను సక్సెస్ చేసినందుకు ఈ సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. దీంతో గజ్వేల్ వేదికగా రెండు పార్టీలు రాజకీయంగా యుద్ధానికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 


గజ్వేల్ లో సభకు కాంగ్రెస్ ప్లాన్ 


తెలంగాణలో రాజకీయ పోరాటం ఓ రేంజ్ కు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తాను గొప్పగా పరిపాలిస్తున్నారని చరిత్రలో మిగిలిపోయే నిర్ణయాలను ఎస్సీ వర్గీకరణ, కులగణన ద్వారా తీసుకున్నామని నమ్ముతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరుతో రెండు బహిరంగసభలకు ప్లాన్ చేసింది. గజ్వేల్, సూర్యాపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలు ప్లన్ చేస్తోంది. సభలకు ముఖ్య అతిథులుగా రాహుల్, ప్రియాంక , ఖర్గే వస్తారని.. గజ్వేల్ లో ఎస్సీ వర్గీకరణ సభ, సూర్యాపేటలో బీసీ కులగణన బహిరంగ సభలు పెడతామని మీడియాకు లీకులు ఇచ్చారు. గజ్వేల్ లో సభ పెట్టాలనే ప్రతిపాదన మాత్రం ఆసక్తికరం అనుకోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలందరూ వస్తారని చెబుతున్నారు. 


గజ్వేల్ నుంచి కేసీఆర్ రీస్టార్ట్ 


ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు జనగామకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వచ్చారు. వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఫిబ్రవరి చివరలో బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని వెల్లడించారు. తెలంగాణ శక్తి ఏంటో చూపిద్దామని కేడర్ కు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూండటంతో పార్టీని యాక్టివ్ చేయడానికి కేసీఆర్  బహిరంగసభకు ప్లాన్ చేశారు. ఇటీవల తనను కలిసిన క్యాడర్ కు అదే చెప్పారు. కేటీఆర్, కవిత, హరీష్‌రావు ప్రజల్లో ఉన్నా కేసీఆర్ తెరపైకి వస్తే వచ్చే ఊపు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగంలోకి  దిగాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.  కేసీఆర్-హరీష్‌రావు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండడంతో జనాన్ని భారీగా సమీకరించవచ్చని భావిస్తోంది. ఈ సభ సక్సెస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది కారు పార్టీ కీలక నేతల అంచనా.


గజ్వేల్ నుంచి కేసీఆర్ వర్సెస్ రేవంత్ యుద్దం ! 


రేవంత్ రెడ్డి సీఎంగా యాక్టివ్ గా ఉండగా.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్ కే పరిమితయ్యారు. ఇప్పటికి పదిహేను నెలలే రేయింది రేవంత్ అధికారంలోకి వచ్చి. అందుకే కొంత సమయం ఇద్దామని కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రావడంతో ఇక రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. అంటే ఇరువురు ఇక తమ దంగల్ ను గజ్వేల్ నుంచి ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాజకీయం ఈ స్థానిక ఎన్నికల  నుంచే వేడి మీద సాగనుంది.