ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వ్యూహప్రతివ్యూహలతో ఉక్కిరికబిక్కిరి అవుతోంది. ముందస్తులో భాగంగానే అన్ని పార్టీలు తమ స్కెచ్‌లకు మెరుగులు దిద్దుతున్నారన్న బలపడుతున్న అనుమానం. అందులోభాగంగానే గంటా, నాదెండ్ల, కన్నా ఎపిసోడ్‌ను రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. 


పవన్ కల్యాణ్‌ అస్త్రాన్ని ఉపయోగించుకోవడంలో బీజేపీ రాష్ట్రనాయకత్వం ఫెయిల్ అయింది. చాలా రోజుల క్రితం కన్నా చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపాయి. పార్టీలో కూడా చాలా డిస్కషన్ జరిగింది. తర్వాత ఏమైందో ఏమౌ కానీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 


కన్నా లక్ష్మీనారాయణ...మౌనం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్న ప్రశ్న. పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేసిన ఆయన తర్వాత ఏం మాట్లాడింది లేదు. ఆయన ఇదిగో పార్టీ మారుతున్నారంటూ రకరకాల స్టోరీలు బయటకు వచ్చాయి. సైకిల్ ఎక్కబోతున్నారని... ఓ నియోజకవర్గం విషయంలో చర్చలు నడుస్తున్నాయి.. అది కన్ఫామ్‌ అయితే జంప్‌ అవుతారని ఊహాగానాలు నడిచాయి. ముఖ్య అనుచరులతో భేటీలు కూడా అవుతున్నారని పుకార్లు షికారు చేశాయి. తర్వాత ఏమైందో ఏమో కానీ దీనిపై అసలు ప్రస్తావనే రాలేదు. 


ఇన్నాళ్లు ఇప్పుడు మరోసారి టాక్‌ ఆఫ్‌ది స్టేట్ అయ్యారు కన్నా లక్ష్మీనారాయణ. గంటల వ్యవధిలోనే కన్నా లక్ష్మీనారాయణ వివిధ పార్టీలకు చెందిన సీనియర్ లీడర్లతో భేటీ కావడం ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం. జనసేన అధినేత పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేన వైపు చూస్తున్నారేమో అన్న అనుమానం చాలా మందిలో వచ్చింది. దీని గురించి తెలుసుకున్న సన్నిహితులు భారీగా ఆయన నివాసానిక చేరుకున్నారు. అలాంటిదేమీ లేదని వారందర్నీ కన్నా పంపించేశారట. 


నాదేండ్ల మనోహర్‌తో సమావేశం అనంతరం కన్నాతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం అయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత లేదని ఇరు వర్గాలు చెబుతున్నా... మూడు గంటల పాటు ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ మీటింగ్‌పై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు కలయిక పై ఊహగానాలు కూడ ఊపందుకున్నాయి. గంటా శ్రీనిసవారావు విశాఖ పట్టణంలో ఈనెల 26వ తేదీన బహిరంగ సభతో బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని గంటా స్పష్టం చేశారు. ఇంతలో కన్నా వంటి సీనియర్ నేతతో భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.  


ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడం... 26 జరిగే భేటీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినది కావడంతో అందరి ఫోకస్‌ ఈ భేటీపై పడింది. సామాజిక వర్గం నాయకుల మద్దతుతో గంటా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్ అందరిలో వస్తోంది. జరగబోయే సమావేశానికి భారీగా జన సమీకరణకు ప్రయత్నాల్లో భాగంగానే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. రంగా వర్దంతిని కేంద్రంగా చేసుకొని గంటా సభ నిర్వహించటం, అదే సభకు భారీగా జన సమీకరణ చేయటం, కాపు వర్గానికి చెందిన నాయకులను ఒకే తాటి పైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే కులాల వారీగా సమావేశాలు వేదికగా మారటం కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


ముందస్తు ఊహాగానాలే కారణమా....


ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్‌కు సంకేతాలు పంపుతున్నారు. బహిరంగంగానే టీడీపీ ఈ విషయాన్ని ప్రచారం చేస్తుంది. అటు జగన్ కూడా ఎన్నికలకు సిద్దం కావాలంటూ పార్టీ శ్రేణులను ఎప్పటికప్పడు అలర్ట్ చేస్తూ నియోజకవర్గాల వారీగా కూడా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాపు వర్గానికి సంబంధించిన సమావేశం కూడా ఇదే నెలలో హడావిడిగా ఏర్పాటు చేయటంపై కూడ చర్చ మొదలైంది. ముందస్తు అంచనాలతోనే ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు అన్ని వర్గాలను రాజకీయ పార్టీలు అలర్ట్ చేసుకోవటంతోపాటుగా సొంతంగా బలం నిరూపించుకునేందుకు కీలక నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.


కన్నా మౌనం...


ఇన్ని రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పటికీ సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో అసలు ఏంజరుగుతోందన్న ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది.