Nitish to Rajya Sabha today Will Chandrababu tomorrow:   బీహార్ రాజకీయాల్లో అజేయుడిగా నిలిచిన నితీష్ కుమార్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా నామినేషన్ దాఖలు చేయడంతో, బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతోందనేది స్పష్టమైంది.  ఏపీలో కూడా జూన్ లోపు నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఉండటంతో.. నెక్స్ట్ చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Continues below advertisement

ఇటీవల లోకేష్ ఎలివేషన్ గురించి ప్రచారం 

చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం 75 ఏళ్లు. నితీష్ కుమార్ కూడా దాదాపు అదే వయస్సులో ఉండటంతో ఈ పోలిక సహజంగానే వస్తోంది. ఏపీలో గత కొంతకాలంగా  లోకేష్ ఎలివేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. క్యాబినెట్ సమావేశాల్లో లోకేష్ ప్రాధాన్యత పెరగడం, ముఖ్యమైన శాఖల నిర్వహణ, విదేశీ పర్యటనల్లో రాష్ట్ర ముఖచిత్రంగా మారడం చూస్తుంటే.. ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టి బాబు కేంద్రానికి వెళ్తారనే చర్చకు బలం చేకూరుస్తోంది. అయితే, నితీష్ లాగా చంద్రబాబుకు ఇది  విశ్రాంతి సమయం కాకపోవచ్చు.

Continues below advertisement

 బీహార్ వర్సెస్ ఏపీ - వేర్వేరు రాజకీయ సమీకరణాలు 

బీహార్, ఏపీల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం  బీజేపీ బలం . బీహార్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, నితీష్ కుమార్ పార్టీ (  జూనియర్ భాగస్వామిగా మారింది. అక్కడ నితీష్ వైదొలగడం బీజేపీకి అనివార్యమైన అవసరం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నం. ఇక్కడ బీజేపీ ఒక మైనర్ పార్టీ. చంద్రబాబు నాయుడు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, కూటమికి అసలైన సారథి. బాబు లేకుండా ఏపీలో కూటమి మనుగడ కష్టమని బీజేపీకి కూడా తెలుసని భావిస్తున్నారు. 

ఆరోగ్యపరంగా చంద్రబాబు ఫిట్ 

నితీష్ కుమార్ ఇటీవలి కాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.  దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయస్సులోనూ అత్యంత చురుకుగా పనిచేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పాలనాపరమైన సమీక్షలు, జిల్లాల పర్యటనలతో ఆయన బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు లేకపోవడం, ఆయన తన పదవిని వదులుకునే అవకాశం లేదని స్పష్టం చేస్తోంది.  చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ రాజకీయాలంటే ఎప్పుడూ ఒక రకమైన విముఖత ఉంది. 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కాదనుకుని రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన చరిత్ర ఆయనది. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ఆయన కలలు. ఇవి ఇంకా ఒక కొలిక్కి రాకుండా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటారన్నది ఊహించలేం. నితీష్ కుమార్ లాగా  అన్ని సభల్లో సభ్యుడిగా ఉండాలి అనే వ్యక్తిగత మైలురాళ్ల కంటే, రాష్ట్ర పునర్నిర్మాణమే బాబు ప్రాధాన్యత.

 లోకేష్ పట్టాభిషేకం.. ఎప్పుడు? 

లోకేష్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చ నిజమే అయినప్పటికీ, అది చంద్రబాబును ఢిల్లీకి పంపడం ద్వారా జరుగుతుందా అనేది అనుమానమే.  చంద్రబాబు కనీసం 2029 వరకు ముఖ్యమంత్రిగా ఉండి, పాలనలో లోకేష్‌కు పూర్తి పట్టు వచ్చాక, పార్టీ శ్రేణులు , కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ అంగీకారంతోనే మార్పు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితిలో బాబు తప్పుకుంటే అది కూటమికి నష్టం చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.