NDA Convenor Chandrababu?: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేషనల్‌ డెమొక్రటిక్‌ అలైన్స్‌ ప్రభుత్వం, పాలనను మరింత సమర్థవంతంగా, మిత్రపక్షాల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకుండా నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా  గతంలో ఎన్డీఏ ఉన్న కన్వీనర్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించి, గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. 

Continues below advertisement

2024లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ను దాటలేకపోయింది. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం 293 మంది ఎంపీల మద్దతుతో నడుస్తోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ 16 సీట్లు, జనతాదళ్‌ యునైడెట్‌12 సీట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

గత పదేళ్లలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండటంతో నిర్ణయాలన్నీ ఏకపక్షంగా సాగాయి. కానీ ఇప్పుడు సమ్మతి రాజకీయాల కాలం నడుస్తోంది. మిత్ర పక్షాల డిమాండ్లు, రాష్ట్రాల ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వ విధానాల మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండేలా చూడటమే ఈ కన్వీనర్‌ నియామకం వెనుక ఉన్న ఉద్దేశం. 

Continues below advertisement

అత్యున్నత బాధ్యతాయుతమైన పదవికి ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో మొదటి పేరు చంద్రబాబు నాయుడు. దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు జాతీయ స్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్ ఫ్రంట్‌ వంటి కూటములను నడిపించిన చారిత్రక అనుభవం ఆయన సొంతం. దక్షిణాది, ఉత్తరాది పార్టీలతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు కూటమికి అదనపు బలం ఇస్తాయని బీజేపీ భావిస్తోంది. 

రెండో పేరు నితీష్ కుమార్. హిందీ హార్ట్‌లాండ్‌గా పిలిచే  ఉత్తర భారత్‌ రాజకీయాల్లో నితీష్ కుమార్ మాస్టర్ మైండ్‌. బిహార్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం, ఇతర ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేయగల నైపుణ్యం ఆయనకు ఉన్నాయి. ప్రధాని మోదీతో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం. 

ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు

ఢిల్లీలో త్వరలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మెగా సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందున, ఈ సమావేశంలోనే అధికారికంగా కన్వీనర్‌ పేరును ప్రకటించే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి.

విధులు, అధికారులు ఎలా ఉంటాయి ?

ఎన్డీయే కన్వీనర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి కేవలం ఒక ప్రతినిధి మాత్రమేకాదు. కూటమిలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే వారధిగా వ్యవహరిస్తారు. మిత్రపక్షాల మధ్య  వచ్చే చిన్నపాటి విభేదాలను చర్చల ద్వారా ప్రాథమిక దశలోనే పరిష్కరించాలి. ఉభయ సభల్లో బిల్లులు పాస్ చేసే సమయంలో భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే మాటపై ఉండేలా చూడాలి. వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటును సజావుగా పూర్తి చేయడం వీరి విధి. 

రాష్ట్రాల అభివృద్ధికి కన్వీనర్‌ ప్రాముఖ్యత

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఈ పదవి చాలా కీలకం కానుంది. రాష్ట్రాల్లోని సమస్యలై నేరుగా కేంద్రమంత్రులు, హోంమంత్రితో చర్చించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.