Vasantha krishna Prasad: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ - సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు

AP Politics: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

Continues below advertisement

Ysrcp Mla Mylavaram Krishna Prasad Joined in Tdp: ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉదయం హైదరాబాద్ లోని టీడీపీ అధినేత నివాసానికి వసంత వెళ్లారు. వసంతకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గం వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న వసంత కృష్ణప్రసాద్.. టీడీపీలో చేరనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఆ మేరకు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 'వైసీపీలో నాకు ఎలాంటి గౌరవం దక్కలేదు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే నా కోరిక. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయమంటేనే చేస్తే. లేదంటే పార్టీ కోసం పనిచేస్తా. ఏపీ అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబే సీఎం కావాలి. చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తా.' అని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. వసంత కృష్ణప్రసాద్ చేరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరగనుంది. అయితే మైలవరం తెలుగుదేశం ఇంఛార్జీగా పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) ఉన్నారు. వసంత చేరికతో ఆయన సీటుకు ఇబ్బంది ఏర్పడింది. అయితే దేవినేని ఉమను పెనమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు, దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని.. టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటామని వసంత కృష్ణప్రసాద్ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు.

Continues below advertisement

మరో ఇద్దరు కీలక నేతలు

వైసీపీకి చెందిన మరో ఇద్దరు కీలక ఎంపీలు సైతం శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులో జరిగే మీటింగ్ లో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు చేరుకోనున్న చంద్రబాబు(Chandra Babu)...అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అక్కడే వైసీపీ(YCP) ఎంపీతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరనున్నారు. ఆయనకు తెలుగుదేశం తరఫున  నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి మధ్యాహ్న  పల్నాడు జిల్లా గురజాలలో జరగనున్న రా..కదలిరా బహిరంగలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇదే కార్యక్రమంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవారాయులు(Lavu Srikrishnadevarayulu) పార్టీలో చేరనున్నారు. ఆయనకు సైతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చింది. ఆయనతోపాటు  వైసీపీకి చెందిన మరో కీలక నేత  ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సైతం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. లావు శ్రీకృష్ణదేవరాయులను  గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా  జగన్ కోరగా... ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను నరసరావుపేట నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి పార్టీకి ఆయన మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగనున్నారు.

Also Read: Confusion of YCP candidates : వైఎస్ఆర్‌సీపీలో జాబితాల గందరగోళం - ఇది కూడా వ్యూహమేనా ?

 

Continues below advertisement