దేవినేని ఉమామహేశ్వరరావు...టీడీపీలో ఫైర్ బ్రాండ్ పేరున్న నేత. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆయన ప్రస్థానం ఎలా ఉంటుంది. పార్టీ నేతల్లో ఉమాపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది. అందరూ అంటున్నట్లే ఈ సారి ఉమాకు సీట్ లేదా? పార్టీకి పని చేయటం వరకే ఆయన పరిమితమా అనే సందేహాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 


దేవినేని ఉమా రూటెటు 


దేవినేని ఉమా భవిష్యత్ కార్యచరణ ఏంటి? పార్టీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది. అనే అంశాలు టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల వరకు దేవినేని ఉమా టీడీపీలో అత్యంత కీలకమైన నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పని చేయటంతో ఆయనకు ఎదురులేదన్నట్లుగా వాతావరణం కనిపించింది. కానీ రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంటారు, ఇప్పుడు ఆయనకు పార్టీలో సీటు లేదన్నట్లుగా వాతావరణం మారిపోయింది. సిట్టింగ్ నియోజకవర్గం అయిన మైలవరం నుంచి దేవినేని ఉమాను పోటీ చేయించేందుకు స్దానిక టీడీపీ నేతలే సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదని, క్యాడర్ ను అమ్మా...ఎంటమ్మా...అంటూ దూరం పెట్టేశారని, దీంతో ఇప్పుడు ఆయన తిరిగి అదే నియోజకవర్గంలో పోటీకి దిగుతుంటే, మా పరిస్దితి ఏంటి అన్నదానిపై క్యాడర్ లో కూడా గందరగోళం నెలకొందని అంటున్నారు.


రాష్ట్రం లెక్కలు సరే 


దేవినేని ఉమా ఎమ్మెల్యేగా  ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు. మంత్రిగా రాష్ట్రం మెత్తం తిరిగి, ప్రాజెక్టులు వ్యవహరంలో లెక్కలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించారని, అయితే అదే సమయంలో పార్టీని నమ్ముకున్న క్యాడర్ ను గాలికి వదిలేశారని అంటున్నారు. అన్ని లెక్కలను అనర్గళంగా చెప్పే దేవినేని ఉమా నియోజకవర్గంలో కార్యకర్తలు, వారి పరిస్థితులపై కనీసం వాకబు కూడా చేయలేదని, దీంతో వారంతా ఇప్పుడు ఉమాను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.


 వసంత రూపంలో...


మైలవరం నియోజకర్గంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితులు నేపథ్యంలో వైసీపీలో  ఇమడలేక పక్క చూపులు చూస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ పై టీడీపీ నేతల ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. టీడీపీ నుంచి దేవినేని ఉమాను ఓడించేందుకు వైసీపీ గత ఎన్నికల్లో వసంతను రంగంలోకి తీసుకువచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్దితుల్లో వసంతకు టీడీపీలో లైన్ క్లియర్ అయ్యిందనే ప్రచారం  ఇప్పుడే ఊపందుకుంది. ఇదే సందర్బంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వసంత ఏ పార్టిలో ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్నారా లేక, స్వతంత్రంగా ఉన్నారా, అది కాకపోతే టీడీపీలో ఉన్నారా ?అని కేశినేని ప్రశ్నించారు. దీంతో టీడీపీలోకి వసంతను తీసుకురావటం కోసమే నాని ఈ కామెంట్స్ చేశారని చెబుతున్నారు.


ఇక సైడవ్వాల్సిందేనా?


తాజాగా టీడీపీలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఎక్కువ శాతం సీట్లు కొత్త వారికి, యువతకు ఇవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు. అందులో భాగంగానే అత్యధిక నియోజకవర్గాలకు సీనియర్లను పక్కన పెట్టి, వీలైతే వారి వారసులు లేదంటే యువతకు సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవినేని ఉమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వారయినా సరే పార్టీ నిర్ణయం మేరకు వ్యవహరించాలని, పార్టీని గెలిపించటమే ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేవినేని ఉమా ఈ సారి ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు త్యాగం చేయక తప్పదా అనే అనుమానాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.