Muthireddy Yadagiri Reddy: జనగామ రాజకీయం రోజు రోజుకు రంజుగా మారుతోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వారి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీఆర్ఎస్ దళిత కార్యకర్తపై ఎమ్మెల్సీ పల్లా వర్గం పోలీస్‌ ​స్టేషన్​లో ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరులు జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. గో బ్యాక్ పల్లా, దళిత ద్రోహి పల్లా అంటూ ఎమ్మెల్యే వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అర్ధనగ్నంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 


ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లాపై విమర్శలు ఎక్కుపెట్టారు. అమాయకులైన దళితులపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసులు పెట్టించడం దారుణమన్నారు. దళితులపై కేసులు పెట్టడం అంటే సీఎం కేసీఆర్ నిర్ణయాలకు వెన్నుపోటు పొడవడమే అన్నారు. ఎస్సీలపై పెట్టిన కేసులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. బీబీనగర్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి 284 మంది అభాగ్యుల పొట్ట కొట్టి భూకబ్జా చేశారని ఆరోపించారు. పల్లా అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.


సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయి పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని ముత్తిరెడ్డి అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. అన్నారు. దళితులు పడికిలి బిగించాలని, దాడులపై పోరాడాలన్నారు. మరో సారి దళితులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని, క్షమించేది లేదన్నారు. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి అధిష్టానం యత్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరి నేతల తీరు పార్టీకి తలనొప్పిగా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


వివాదానికి కారణమైన రాఖీ స్వీట్లు
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయుల మధ్య సోషల్​ మీడియాలో వార్​ నడుస్తోంది. ఒకరిపై ఒకరు మాటల దాడి, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్‌పై పల్లా అనుచరుడు కేశిరెడ్డి రాకేశ్ రెడ్డి గురువారం రాత్రి జనగామ టౌన్​ పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాఖీ పండుగ రోజు పల్లా పరువుకు భంగం కలిగించేలా విజయ్ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. స్థానిక పోలీసులు విజయ్‌ని శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్​ కు పిలిపించి విచారణ చేశారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించి పంపించారు. 


రాఖీ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌​లోని పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. అక్కడ పల్లా పేరుతో ఉన్న స్వీట్​ బాక్సులను పలువురు లీడర్లకు పంచారని ముత్తిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు జనగామ మహిళలు పల్లాకు గుర్తురాలేదా? పట్టభధ్రుల ఓట్లతో గెలిచిన పల్లా ఏనాడూ జనగామకు రాలేదని ఆరోపించారు. సొంత అక్క భూమిని కబ్జాచేసిన ఆయనకు ఇప్పుడు ఆడబిడ్డలు గుర్తొచ్చారా? అంటూ తిప్పారపు విజయ్​ పోస్టులు పెట్టాడు. ఈ నేపథ్యంలో అతనిపో పల్లా వర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీనిపై విజయ్​ స్పందించారు. తనపై పల్లా అనుచరులు కేసు పెట్టడం దళితులపై దాడి అన్నారు. దళితుడిని పోలీస్​ స్టేషన్‌​కు పిలిపించి మనోవేదనకు గురిచేయించినందుకు పల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. తనకు పల్లా వర్గం నుంచి ప్రాణ భయం ఉందని, టికెట్​ రాక ముందే బెదిరింపులు ఉంటే తరువాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్​ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్​ రెడ్డి పలుమార్లు ఫోన్​ చేసి తనను బెదిరిస్తున్నారని విజయ్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన  కోరారు.