Telangana BJLP Leader Suspense : తెలంగాణ బీజేపీలో...శాసనసభాపక్ష నేత ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు...పలువురు నేతలు దీనికి కోసం పోటీ పడుతున్నారు. సీనియర్లతో పాటు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు దగ్గరపడుతున్నా, కాషాయ పార్టీ నేతలు మాత్రం తేల్చలేకపోతున్నారు. ఈ రేసులో గోషామహల్ నుంచి మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ (Rajasingh), నిర్మల్ నుంచి రెండు సార్లు గెలుపొందిన ఆలేటి మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy)తో పాటు తొలిసారి గెలుపొందిన కామారెడ్డి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి (VenkataRamana Reddy ), ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో ధన్ పాల్ సూర్యనారాయణ, (Suryanarayana) పైడి రాకేశ్ రెడ్డి (Rakesh Reddy)ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. 


తేల్చుకోలేకపోతున్న అధిష్ఠానం


గత డిసెంబర్‌లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటించారు. అప్పుడు శాసనసభాపక్ష నేత అంశం కొలిక్కి వస్తుందని నేతలు భావించిన నేతలకు నిరాశే ఎదురైంది. అమిత్ షా ఎటు తేల్చకుండానే ఢిల్లీ వెళ్లిపోయారు.  దీంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. నేతల అభిప్రాయాన్ని హైకమాండ్ కు పంపారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన బీజేఎల్పీ నేతను ప్రకటించనున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు. గురువారం నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు మరో రోజే మిగిలి ఉన్నప్పటికీ...ఇప్పటికి అసెంబ్లీ పక్ష నేతను ఎంపికపై నిర్ణయాన్ని తీసుకోలేకపోతోంది. 


రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి


వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్...ఈ పదవికి ఆశలు పెట్టుకున్నారు. నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టి.రాజాసింగ్‌ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. అయితే ఆయనకు తెలుగుపై పట్టులేకపోవడం మైనస్ మారనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar Redd)...నిర్మల్ నుంచి రెండు పర్యాయాలు గెలుపొందారు. అయితే ఆయన ఎన్నికల ముందు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించారు. జెయింట్ కిల్లర్ గా ఆయనకు పేరుంది.  రమణారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం మైనస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తో పాటు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిలు బీజేఎల్పీ పదవికి ఆశలు పెట్టుకున్నారు. 


బీసీ ఎమ్మెల్యేలకే పదవిని అప్పగిస్తారా ?


శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై పట్టు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిగా అవగాహన ఉండాలి. అధికార పార్టీకి ఎప్పటికపుడు కౌంటర్లు ఇవ్వాల్సి  ఉంటుంది. ఈ నేపథ్యంలో చురుగ్గా స్పందించగలిగే నేతకే బీజేఎల్పీ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించింది. దీన్ని బీసీ ఎమ్మెల్యేలు ఇపుడు లేవనెత్తుతున్నారు. బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ పార్టీలో వినిపిస్తోంది. బీజేపీ తమ నాయకుడ్నిఎపుడు తేలుస్తుందో వేచి చూడాలి.