KCR Political Move:  తెలంగాణ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి  ప్రస్తుతం ఒక విలక్షణమైన, అత్యంత సంక్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గులాబీ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పార్టీ పయనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న సమయంలో   పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్గత సమావేశాల్లో  వచ్చే ఎన్నికల్లో మనది ఒంటరి పోరే.. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు అని గట్టిగా చెప్తున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆ మాటలపై ఇంకా నమ్మకం కలగడం లేదు. దీనికి ప్రధాన కారణం.. కేంద్రంలోని బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించకపోవడమే.

Continues below advertisement

బీజేపీ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే, బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీ వైపు మళ్లినట్లు స్పష్టమైంది. గతంలో గులాబీ వైపు నిలిచిన అర్బన్, సెమి-అర్బన్,  హిందూ ఓటర్లు గంపగుత్తగా కమలం వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ చేసిన ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేశామని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ గట్టిగా చాటుకుంటోంది. ఇలాంటి తరుణంలో, తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని, బీజేపీకి అసలు క్షేత్రస్థాయి బలం లేదని కేటీఆర్ ప్రకటిస్తున్నారు. కానీ, తమ ఓట్లను లాగేసుకున్న బీజేపీని ధాటుగా ఎదుర్కోకుండా, కేవలం కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో పలు అనుమానాలకు తావిస్తోంది.  బీజేపీపై సాఫ్ట్ పాలిటిక్స్ నడుపుతూ.. రేపటి ఎన్నికల్లో ఆ పార్టీనే మాకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్తే ప్రజలు కన్విన్స్ అవ్వడం కష్టమేన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Continues below advertisement

బీజేపీతో బంధంపై ప్రచారాలను తిప్పికొట్టలేకపోతున్న బీఆర్ఎస్ 

బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ అధినాయకత్వం విఫలమవుతోంది. కవిత బెయిల్ వ్యవహారం దగ్గర నుంచి నేటి వరకు కేంద్ర సంస్థల దూకుడు తగ్గడం, పార్లమెంట్‌లో కీలక బిల్లులపై బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం వహించడం వంటి పరిణామాలు  బీజేపీ-బీఆర్ఎస్ భాయ్ భాయ్  అనే రూమర్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో, వార్తల్లో విలీనం లేదా పొత్తుల గురించిన రచ్చ జరుగుతూనే ఉంది. ఈ ప్రచారానికి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే కేవలం ఆఫ్‌లైన్ ప్రకటనలు సరిపోవు, క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై  ఆన్‌లైన్, ఆన్‌గ్రౌండ్  పోరాటాలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 

గ్రేటర్ ఎన్నికల్లో తేలిపోతుందా?

త్వరలో జరగబోయే గ్రేటర్  ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఒక పెద్ద యాసిడ్ టెస్ట్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలంటే.. అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయాలను అంతే తీవ్రంగా నిలదీయాలి. అలా కాకుండా కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే 100% ఫోకస్ పెట్టి, కేంద్రంపై చిన్న విమర్శ కూడా చేయకపోతే, ప్రజలు బీఆర్ఎస్‌ను కేవలం ఒక 'బి-టీమ్' గానే చూసే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలతో తలపడేటప్పుడు రెండు వైపులా సమానమైన దూకుడు  ప్రదర్శించినప్పుడే పొలిటికల్ సీరియస్‌నెస్ కనిపిస్తుంది. కేటీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదనే విమర్శలు పోవాలంటే.. బీజేపీ హిడెన్ ఎజెండాను కూడా గులాబీ పార్టీ అంతే ధీటుగా బట్టబయలు చేయాలి. లేదంటే, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీఆర్ఎస్ ఎంత మొత్తుకున్నా, విశ్లేషకులు గానీ, అటు ఓటర్లు గానీ దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి, సాఫ్ట్ పాలిటిక్స్ పక్కనబెట్టి తీవ్రమైన దూకుడు ప్రదర్శించడమే ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఏకైక మార్గం.