తెలంగాణ సీఎం కేసీఆర్ - వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవడమే చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిన్న నేత కేసీఆర్. ఆయన రాజకీయ సలహాలు ఇతరుల నుంచి తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కొద్ది రోజులుగా కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ప్రకారం రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నప్పటికీ టీఆర్ఎస్ వర్గాలు కూడా ఖచ్చితంగా నిజమని నమ్మలేకపోయాయి. కానీ గత రెండు రోజులుగా పీకే ఫామ్ హౌస్‌లోనే కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారని స్పష్టత రావడంతో నమ్ముతున్నారు. సినిమాల్లో రాజమౌళి లాంటి ట్రాక్ రికార్డు రాజకీయ వ్యూహకర్తగా తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ మరో సారి టీఆర్ఎస్‌ను.. కేసీఆర్‌ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తారని నమ్ముతున్నారు. 


ముందు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే జాతీయ రాజకీయాల ఆశలు ! 


ప్రశాంత్ కిషోర్ సలహాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆయన సలహాలతోనే కేంద్రంపై కేసీఆర్ ఘాటుగా విరుచుకుపడుతున్నారని అనుకుంటున్నారు. అయితే బీజేపీపై విరుచుకుపడటంలో దీర్ఘ కాలంలో జాతీయ రాజకీయాల కోణం ఉన్నాకేసీఆర్ తక్షణ కర్తవ్యం రాష్ట్ర రాజకీయాలే. తెలంగాణ సీఎం ఢిల్లీ బీజేపీని గురి పెట్టి గల్లీ అధికారాన్ని టార్గెట్ చేశారనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2024లో వస్తాయి. అంత కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జరగినా 2023 ద్వితీయార్థంలో జరగాల్సి ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ ఇంకా కాస్త ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది .


ఢిల్లీని గురి పెట్టింది గల్లీలో గెలవడానికే !


కేసీఆర్ ముందస్తుకు వెళ్లినా వెళ్లకపోయినా పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరగవు. ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అంటే సెమీ ఫైనల్‌ను కేసీఆర్ ఎదుర్కోబోతున్నారన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. గత ముందస్తు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. అదే అధికారంలో లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయో ఊహించడం కష్టం. అందుకే ఇప్పటికిప్పుడు జాతీయ రాజకీయాల కన్నా కేసీఆర్ ఆలోచన చేయాల్సింది రాష్ట్ర రాజకీయాల గురించే. ఈ విషయంలో రాజకీయ ఉద్దండుడు అయిన కేసీఆర్‌కు క్లారిటీ లేదని అనుకోలేం. అందుకే బయటకు కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసినా.. అదే పనిగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినా అంతిమ లక్ష్యం మాత్రం రాష్ట్ర రాజకీయాలే. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికిప్పుడు కేసీఆర్‌కు  పని చేసినా అది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ..కేంద్రంపై వ్యతిరేకతగా మార్చే ప్లాన్ !


జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లుగా కేసీఆర్ రాజకీయం చేయడంలో వ్యూహం ఉందని భావిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా బీజేపీతో పోటీ అనిపించేలా చేయడం.. తద్వారా కాంగ్రెస్‌ రేసులోకి రాకుండా చేయడం ప్రధానం అనుకోవచ్చు. బీజేపీకి ఇప్పటికి హైదరాబాద్‌లో తప్ప ఇతరచోట్ల బలమైన క్యాడర్ లేదు. చేరుతున్న వారు కూడా పరిమితంగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో మోడీ ప్రభావం పని చేయదని గత ముందస్తు ఎన్నికల సమయంలోనే తేలిపోయింది. అదే సమయంలో రెండూ అధికార పార్టీలే. అధికార వ్యతిరేకత సహజం. ఆ అధికార వ్యతిరేకతను తమ మీద నుంచి బీజేపీపైకి నెట్టే వ్యూహం కేసీఆర్ రాజకీయంలో ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే ఆయన బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నారని అంచనా వేయవచ్చు. 


సర్వే చేసిచ్చిన పీకే.. ఇక కార్యాచరణ !


ఇంట గెలిచిన తర్వాతనే రెచ్చ పోరాటానికి వెళ్లాలి. ఈ అంశంలో స్పష్టత ఉంది కాబట్టే ప్రశాంత్ కిషోర్‌తో ముందుగా రాష్ట్రంలోని పరిస్థితులపై సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టును విశ్లేషించి తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై ఓ స్పష్టతకు రావడానికే చర్చోపచర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్ మొదటి టార్గెట్ రాష్టమే. కానీ ఆయన గురి పెట్టింది మాత్రం ఢిల్లీ నుంచి !