Munugode Result Analysis :  తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు ఎన్నికల ఫలితం తేలిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఉపఎన్నికలు ఎక్కడైనా అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయని ఈ ఫలితాన్ని తేలిగ్గా తీసుకోలేం... ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఫలితం టీఆర్ఎస్‌కు అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. కానీ మునుగోడులో మాత్రం భిన్నం. పైగా మునుగోడు టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు. అయినప్పటికీ టీఆర్ఎస్ అనూహ్యమైన విజయం సాధించింది. దీనికి కారణాలు టీఆర్ఎస్ వ్యూహంతో పాటు విపక్షాల వైఫల్యం కూడా అనుకోవచ్చు. 


స్వయంగా మునుగోడు ఉపఎన్నికను పర్యవేక్షించిన కేసీఆర్!


మునుగోడు ఉపఎన్నిక ఖాయమని తేలిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పర్యవేక్షణ ప్రారంభించారు. షెడ్యూల్‌కు ముందు ఓ బహిరంగసభ.. ఎన్నికలకు ముందు మరో బహిరంగసభ పెట్టి ప్రసంగించారు. సూటిగా చెప్పాల్సింది చెప్పారు. ప్రచార ప్రణాళిక కూడా స్వయంగా రూపొందించారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే అంత మందికి గ్రామాలను కేటాయించారు. ఇక మంత్రుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా పార్టీలోని అన్ని వ్యవస్థలు మునుగోడులో పని చేశారు. ప్రతీ ఓటర్‌నూ ఓ స్థాయి టీార్ఎస్ నేత రెండు మూడు సార్లు కలిశారు. ఓటును అభ్యర్థించారు. అలాగే అధికార పార్టీగా గెలిస్తే వచ్చే పథకాలు.. అభివృద్ధి పనులు వారిని ఆకట్టుకునేలా చెప్పగలిగారు. మొత్తంగా కేసీఆర్ ప్రచార వ్యూహం వర్కవుట్ అయింది. 


ఎలక్షనీరింగ్‌లోనూ టీఆర్ఎస్ కింగ్ !


ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థి.. ప్రచారం మాత్రమే  కాదు.. ఎలక్షనీరింగ్ కూడా చాలా కీలకం. టీఆర్ఎస్ ఈ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించింది. అధికార పార్టీగా ఉన్న అడ్వాంటేజ్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంది. ఓటర్లను ఎక్కడా నిరాశపర్చలేదు. పోలింగ్ రోజు.. ఓటింగ్‌కు వెళ్లబోమన్న ఓ గ్రామ ఓటర్లతో..  కేటీఆర్ స్వయంగా మాట్లాడటం దీనికి నిదర్శనం. పెద్ద ఎత్తున డబ్బులు పంచారని.. మద్యం పోయించారని  వస్తున్న విమర్శలు అన్నీ గెలుపులో కొట్టుకుపోతాయి. ఇతర పార్టీల కంటే భిన్నంగా ఎలక్షనీరింగ్ చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ కావడం టీఆర్ఎస్‌కు కలిసి వచ్చింది. 


మొదట్లో దూకుడు.. చివరిలో చేతులెత్తేసిన బీజేపీ !


ఉపఎన్నికలో గెలుపు ఖాయమని ఎంతో నమ్మకంగా రేస్ ప్రారంభించిన బీజేపీ .. మధ్యలో డల్ అయిపోయింది. మొదట్లో చాలా మంది జాతీయ నేతలు ప్రచారానికి వచ్చారు. కానీ మధ్యకు వచ్చే సరికి అందరూ డ్రాప్ అయిపోయారు. రాజగోపాల్ రెడ్డికి ఆర్థిక సమస్యలు ఉంటాయని ఎవరూ అనుకోరు. కానీ ఆయన మనుగోడుకు తెప్పించుకుంటున్న్ సొమ్ము ఎక్కడిక్కడ పట్టుబడింది. ఇలా హైదరాబాద్ శివార్లలోనే రూ. పది కోట్ల కంటే ఎక్కువ పట్టుబడింది. ఇక తప్పనిసరి అన్నట్లుగా తన కుమారుడు డైరక్టర్‌గా ఉన్న కంపెనీ నుంచి పార్టీ నేతల ఖాతాలకు డబ్బులు జమ చేయాల్సి వచ్చింది. ఈ టెన్షన్‌లో ఉండగానే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో  బీజేపీకి కథ అడ్డం తిరిగినట్లయింది. చివరికి వచ్చే సరికి.. రాజగోపాల్ రెడ్డి వెనుకబడిపోయారని అందరూ ఓ నమ్మకానికి వచ్చారు. ఏడో తేదీన ఆయన ఆస్ట్రేలియా వెళ్లిపోవడానికి టిక్కెట్  బుక్ చేసుకున్నట్లుగా బయటకు రావడంతో.. బీజేపీ క్యాడర్ కూడా  అప్పుడే ఆశలు వదిలేసుకున్నారు. 


టీఆర్ఎస్, బీజేపీ ధన శక్తి ముందు నిలవలేకపోయిన కాంగ్రెస్ !


ఇక సిట్టింగ్ సీటు అయిన మునుగోడులో మొదట్లో గెలిచేస్తామని కాంగ్రెస్ అనుకుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే చండూరులో భారీ సభ నిర్వహించారు. దూకుడుగా ప్రజల్లోకి వెళ్లారు. కానీ టీఆర్ఎస్,  బీజేపీ ధన బలం ముందు కాంగ్రెస్ తూగలే్కపోయింది. మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాల్సినన్ని బండలు వేశారు.  పోలింగ్ చివరి రోజు పాల్వాయి స్రవంతి కేసీఆర్ ను కలిసినట్లుగా ప్రచారం చేశారు. అదే సమయంలో తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అయింది. ఓ వైపు మునుగోడు బాధ్యతలు.. మరోవైపు పాదయాత్ర వ్యవహారాలను చూసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనాయకత్వం సతమయింది. ఎలా చూసినా..  సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ ఎన్నిక ద్వారా ఆ పార్టీ బలహీనతలో మరోసారి బయటపడ్డాయి. 


మునుగోడు ఉపఎన్నికల్లో మొదట బీజేపీ హుషారు చూపించినా.. రాను రాను టీఆర్ఎస్‌దే పైచేయి అయింది. కాంగ్రెస్ అసలు రేసులోకి రాలేదు. చివరికిఫలితం అలాగే వచ్చింది.