Karnataka CM Resignation: కర్ణాటక రాజకీయాల్లో గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సహచర మంత్రులు, సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సిద్ధరామయ్య వారసుడిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది దక్షిణాది రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అతి పెద్ద వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Continues below advertisement

బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది?

గురువారం ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంది. మెనూలో మసాలా దోశ, ఇడ్లీ, సాంబార్‌, కేసరిబాత్ వంటి కర్ణాట రుచులు ఉన్నప్పటికీ అక్కడ చర్చంతా వేరే సాగింది. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన చిత్రాల ప్రకారం  సమావేశం అత్యంత భావోద్వేగంగా సాగింది. డీకే శివకుమార్ సిద్ధరామయ్యను ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌ను ప్రతిపాదించింది. నేను దానికి అంగీకరించాను. అని సిద్ధరామయ్య ఈ సమావేశంలో ప్రకటించారు. 

ఈ ప్రకటన వెలువడగానే డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన నివాసం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. 

Continues below advertisement

సిద్ధరామయ్య మార్పునకు కారణం ఏంటీ?

ఈ నాయకత్వ మార్పు వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల  సమయంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒక పవర్ షేరింగ్ అగ్రిమెంట్ కుదిరినట్టు వార్తలు వచ్చాయి. ఆ ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని ఆ తర్వాత పదవిని డీకేఎస్‌ు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. నవంబర్‌ 2025 నాటిక ఈ గడువు ముగిసినప్పటికీ సిద్ధరామయ్య కొంతకాలం కొనసాగారు. 

కాంగ్రెస్ నిర్ణయం వెనుకు మాస్టర్ మైండ్ ఎవరు?

గత 48 గంటలుగా ఢిల్లీలో జరిగిన వరుస సమావేశాల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సిద్ధరామయ్యను ఒప్పించారు. ముఖ్యంగా ఈ మార్పు కోసం ప్రియాంక గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని కేడర్ స్థాయిలో బలోపేతం చేయగల డీకే శివకుమార్‌కు పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. 

సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయం వెలువడినప్పటికీ ప్రమాణ స్వీకారానికి చిక్కు వచ్చింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా బయట ఉన్నారు. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాతే సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పిస్తారు. డీకే శివకుమార్ శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

పార్టీలో చీలిక రాకుండా ఎత్తుగడ

ఇది ఒక రోజులో జరిగిన ప్రక్రియ కాదు. కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత జాగ్రత్తగా, పార్టీలో చీలికలకు లేకుండా ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సిద్ధరామయ్య వంటి లీడర్‌ను పదవి నుంచి తొలగించం పార్టీకి నష్టం కలిగించవచ్చు. అందుకే ఆయనకు రాజ్యసభ సీటుతోపాటు కేంద్ర పార్టీలో కీలక బాధ్యతలు ఆఫర్ చేశారు. అయితే సిద్ధరామయ్య ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని, వరుణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొసాగాలని అనుకుంటున్నట్టు సమాచారం. పార్టీలో విభేదాలు లేవని చెప్పడానికి టుగెదర్ ఉయ్ ఆర్‌ యునైటెడ్ అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో ఫొటోలను షేర్ చేశారు. 

సిద్ధరామయ్య vs డీకే శివకుమార్ 

సిద్ధరామయ్య అహింద( వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, దళితులు) ఓటు బ్యాంకుపై బలమైన పట్టు ఉన్న నాయకుడు. సామాజిక న్యాయం , సంక్షేమ పథకాలు ఆయన బలం. డీకే శివకుమార్ పార్టీ అర్గనైజర్,ట్రబుల్ షూటర్, వొక్కలిగ సామాజిక వర్గంలో పట్టు ఉన్న నాయకుడు. ఎన్నికల నిర్వహణలో నిధుల సేకరణలో ఆయనకు తిరుగులేదు.