కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరులోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సీనియర్ నేత, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి జాబితాలో కూడా కన్నా పేరు వినిపించింది. అంతటి సీనియర్ నేత పరిస్థితులు, మారిన రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వచ్చారు. వచ్చీరాగానే ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీకి కూడా రాజీనామా చేసి తర్వాత ఏ పార్టీలో చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది. 


కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కాపు రిజర్వషన్ల అంశం వచ్చినప్పుడు చంద్రబాబును పొగిడారు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ తీరుపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం అందుకున్న పార్టీ ఆయన్ని ఆహ్వానించడానికి క్యూ కట్టారు. అలా ఆహ్వానించిన పార్టీల్లో టీడీపీ, జనసేన, వైసీపీ ఉన్నాయి. ఆయన మాత్రం అన్ని అంచనాలు వేసుకున్న తర్వాత... అనుచరులతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. 


ఇటీవల విశాఖలో  కాపు సంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశంలో  జీవీఎల్ నరసింహారావుకు సన్మానం చేశారు. పార్లమెంట్‌లో కాపు రిజర్వేషన్ల అంశంపై జీవీఎల్ ఓ ప్రశ్న వేశారని  ఈ సన్మానం చేశారు.  కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది.  ఇక సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలి ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రిజర్వేషన్లు చెల్లవని క్యాన్సిల్ చేసింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ ఓ ప్రశ్న అడిగారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయా అని ప్రశ్నించారు. అవి చట్టబద్దంగానే ఉన్నాయని చెల్లుతాయని కేంద్రం సమాధానం ఇచ్చింది.  అలా తాను ప్రశ్న అడిగినందుకే ఆ సమాధానం వచ్చిందని జీవీఎల్ నరసింహారావు కాపు సంఘాలతో సన్మానాలు చేయించుకున్నారని  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఇది కన్నా లక్ష్మినారాయణకు కోపం తెప్పించిందని చెబుతున్నారు.  


కాపు రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్ తెరపైకి తెస్తే.... చంద్రబాబు పూర్తి చేశారు !     


దీనిపై మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని..  ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశారన్నారు. చంద్రబాబు ఈ రిజర్వేషన్లను పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లను ప్రభుత్వం తొలగించిందని.. కన్నా చెప్పకనే చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా కిందకాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జనసేన విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా కన్నా అభ్యంతరం వ్యక్తం  చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ .. తన నిర్ణయాలను తాను తీసుకోనివ్వాలని ఇతరులు ప్రభావితం చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారని స్పష్టం చేశారు.   


‘‘సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే పార్టీని వీడుతున్నా. ఆయన వల్లే పార్టీలో ఇమడలేకపోయా. పార్టీతో చర్చించకుండా జీవీఎల్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రంగా పేరు క్రిష్ణా జిల్లాకు పెట్టాలని గతంలోనే ఉద్యమం చేశాం. అప్పుడే జీవీఎల్ ఉద్యమంలో పాల్గొంటే బాగుండేది. కొందరు ఓవర్ నైట్ స్టార్ నేత కావాలని ప్రయత్నిస్తున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పార్టీలో పరిస్థితులు మారాయి’’ -కన్నా లక్ష్మీ నారాయణ