K.Keshavarao Interesting Comments: బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్న క్రమంలో సీనియర్ నేత కె.కేశవరావు (Keshavarao) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గురించి టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ ఆలోచించిందని.. 1998 నుంచే తెలంగాణ గురించి పోరాటం మొదలైందని చెప్పారు. 'నేను 55 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నా. 4 రాష్ట్రాలకు కాంగ్రెస్ నుంచి ఇంఛార్జీగా ఉన్నాను. నన్ను cwc మెంబర్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ. తొలిసారి 1998లో 40 మంది ఎమ్మెల్యేలతో సోనియాగాంధీకి తెలంగాణ కోసం లెటర్ ఇచ్చాం. కాంగ్రెస్ ఎంపీలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతగానో కొట్లాడాం. ఆరు వర్కింగ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. నేను వార్ గ్రూపులో సభ్యుడిగా కూడా పనిచేశాను. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా.. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలో చేరాను. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంటే దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది. అందుకే అతి త్వరలో నా కుమార్తె విజయలక్ష్మితో కలిసి సొంతగూటికి చేరుతున్నా. అవసరమైతే నా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను.' అని కేశవరావు వెల్లడించారు.


'వారిని ఛాలెంజ్ చేయలేరు'


బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎవరూ ఛాలెంజ్ చేయలేరని.. వాళ్లు ముగ్గురూ టాలెంటెడ్ లీడర్స్ అని కేశవరావు అన్నారు. వారు 24 గంటలూ పని చేయాలనే ఆలోచనతోనే ఉంటారని.. ఆ పార్టీలో తనకు, తన మాటకు కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారని.. మరెక్కడా తనకు అంత గౌరవం దక్కలేదని చెప్పారు. కేసీఆర్ వల్లే తెలంగాణ దేశంలో అగ్రభాగాన ఉందని కొనియాడారు. అయితే, బీఆర్ఎస్ ను కుటుంబమే నడిపిస్తోందనే భావన ప్రజల్లో ఉందని కేశవరావు వ్యాఖ్యానించారు. ఏం చేసినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదని.. కొన్ని సరిచేసుకోవాల్సినవి బీఆర్ఎస్ సరిచేసుకోలేదని అన్నారు. గురువారం కేసీఆర్ ను కలిసినప్పుడు.. పార్టీని విడిచిపోవద్దని అన్నారని చెప్పారు. 'తీర్థయాత్ర ముగిసిందని అనుకుంటున్నా.. ఇప్పుడు సొంత గూటికి చేరుతున్నా. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ నా ముందే సోనియా గాంధీకి చెప్పారు. కానీ విలీనం చేయలేదు. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 64 సార్లు రాజ్యసభ సమావేశాలకు వెళ్లాను. బీఆర్ఎస్ నుంచి 16 సార్లు మాత్రమే వెళ్లాను. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోకి వెళ్లాలని కేసీఆర్ కు చెప్పాను. కానీ కేసీఆర్ నా మాట వినలేదు.' అని కేశవరావు పేర్కొన్నారు.


ఢిల్లీ నాయకులతో మాట్లాడి..


తన కుమార్తె విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని.. తాను ఢిల్లీ నాయకులతో చర్చించిన తర్వాత జాయినింగ్ తేదీ చెప్తానని కేశవరావు వెల్లడించారు. తాను పార్టీ మారడంపై విప్ ఇస్తే.. అందుకు సమాధానం చెప్తానని అన్నారు. కేసీఆర్ తనకు రాజ్యసభ మాత్రమే ఇచ్చారని.. తొలిసారి రాజ్యసభ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వేసిన రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచానని గుర్తు చేశారు.


Also Read: Harish Rao: 'ఆకులు రాలే కాలం, కొత్త చిగురు మళ్లీ పార్టీలోకి వస్తుంది' - పార్టీ మారుతున్న నేతలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు