Anantapur Politics: అనంతపురం: రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలలో జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) ఫ్యామిలీ ఒకటి. జేసీ దివాకర్ రెడ్డి పేరు చెప్పగానే ఏపీలో రాజకీయంగా తెలియని వారు ఉండరు. ఆ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి (JC Pavan Kumar Reddy) పోటీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తాడా.. జేసీ పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది.  


గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు జేసీ పవన్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. గత సంవత్సరం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ అవుతారని జేసీ పవన్ రెడ్డి వర్గం చెబుతూ వస్తోంది. గత కొద్ది కాలంగా చేసి పవన్ రెడ్డి పార్టీ మారుతున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది. జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటారంటే కూడా చర్చ నడిచింది.. జేసీ పవన్ కుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండడం పార్టీ మారుతున్నారన్న వార్తలు రావడంతో  కొంతమంది అనంతపురం పార్లమెంటు అభ్యర్థులుగా కొందరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 


అనంతపురం పార్లమెంటు బరిలోకి ఎవరు? 
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతపురం పార్లమెంటు నుంచి ఎవరిని బరిలోకి దింపాల అని సర్వేలు కూడా చేయించినట్టు సమాచారం.  చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికల్లో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలతో అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ నియమించారు. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరహాలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బిసి నాయకులనే బరిలో దించుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. 


చంద్రబాబుతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ 
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో జేసీ పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న చంద్రబాబుని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వాలని జేసీ పవన్ రెడ్డి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ అంశాన్ని సున్నితంగా తోసిపుచ్చినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థులుగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యతిని బరిలో దించుతునట్లు జేసీ పవన్ కుమార్ రెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. 


ఇప్పటికే అనంతపురం జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలోని ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు  పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన కుటుంబంలో భాగంగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చించిన అనంతరం మరి కొద్ది రోజుల్లోనే అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో సుదీర్ఘ రాజకీయ అనుభవన జేసీ కుటుంబం దీన్ని ఎలా తీసుకుంటుందో అని జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.