Jagan :  ఓటమి తర్వాత జగన్ నిర్వేదంలో కనిపిస్తున్నారు. యుద్ధంలో గెలుపోటములు సర్వసహజం..ఎంత పెద్ద మహావీరుడికైనా ఏదో ఒకరోజు ఓటమి ఎదురవుతుంది. గెలిచినప్పుడు పొంగిపోకపోయినా పర్వాలేదు గానీ...ఓటమి చెందినప్పుడు కుంగిపోకూడదు..ఇదీ యుద్ధవీరుడి మొదటి లక్షణం. రాజు కుంగుబాటుకు గురైతే..శ్రేణులు చెల్లాచెదురవుతాయి. ఓటమి అనుభవాల నుంచి తప్పులు తెలుసుకుని తిరిగి పుంజుకోవడమే వీరుడి ఉత్తమ లక్షణం.తిరిగి యుద్ధం చేసేవరకు శ్రేణులకు అండగా ఉండాలి. వారిలో నిరంతరం స్ఫూర్తి రగిలిస్తూ మరో విజయానికి సిద్ధం చేయాలి. రాజు ఎంత ధైర్యంగా ఉంటే...సైనికబలగం అంతకు రెట్టింపు బలంగా తయారవుతుంది. కానీ ఒక్క ఓటమితో ఢీలాపడిపోయిన వైసీపీ( YCP) అధినేత జగన్‌( Jagan)కు నిర్వేదం ఆవహించినట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాు. 


భారీ ఓటమితో ఢీలాపడ్డ జగన్         


చరిత్ర కనీవినీ ఎరగని విజయం...రికార్డులన్నీ తిరగరాస్తూ 151 ఎమ్మెల్యేల బలం...దేశ చరిత్రలోనే తొలిసారి 50శాతానికి పైగా ప్రజల మద్దతు...ఐదేళ్లపాటు అప్రతిహాతంగా  అడ్డూ, అదుపు చెప్పేవారే లేనివిధంగా సాగిన పాలన...చుట్టూ వెయ్యిమందితో కూడిన రక్షణదళం...ఐదేళ్లపాటు జగన్(Jagan) అనుభవించిన ఈ రాజసం...ఒక్క ఓటుతో జనం ఆయనకు దూరం చేశారు. దుర్భేద్యమైన రాజ కోటలోకి ప్రవేశం కోసం నెలల తరబడి ఎమ్మెల్యేలే ఎదురుచూసిన రోజుల నుంచి నేడు కనీసం పలకరించే వారే కరవయ్యారను అనడం కన్నా...ఆయనే వారిని దూర చేసుకున్నారు అనడం సబబు. తిరుగులేని మెజార్టీ చూసుకుని అన్నారో...లేక తాను అందిస్తున్న సంక్షేమపథకాలపై ఉన్న నమ్మకంతో అన్నారో తెలియదు గానీ...30 ఏళ్లపాటు తానే సీఎంనంటూ  తనకు తానే ప్రకటించుకున్నారు. కానీ ఆశలన్నీ వమ్మయ్యాయి. ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేంతగా ఎంత ఎత్తుకు అయితే ఎదిగారో...గత ఎన్నికల్లో అంతే స్పీడ్‌తో అథపాతాళానికి పడిపోయారు. 


ఓటమిని స్వీకరించలేకపోతున్న వైసీపీ అధినేత


అయితే రాజకీయాల్లో గెలుపోటములు సహజం...ఎన్నో డక్కామొక్కీలు తిని సీఎం సీటు అధిరోహించిన జగన్‌కు కూడా ఇది తెలుసు. ఓటమి కూడా ఆయనకు కొత్తేమి కాదు..కాకపోతే ఈసారి ఓటమిని మాత్రం ఆయన అంత త్వరగా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జనాలకు ఇంత మంచి చేసినా ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అర్థంకావడం లేదు.  మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయడండని ధైర్యంగా చెప్పాడంటే...ఆ మాటల వెనక  ఎంత కాన్ఫిడెన్స్‌ ఉండాలి. సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా....ఖచ్చితంగా మళ్లీ గెలుస్తున్నామంటూ  ఎన్నికల ముందు ఆయన శ్రేణులను ఎంతో ఉత్సాహపరిచాడు. కానీ ఎన్నికల రిజల్ట్స్‌ తర్వాత జగన్(Jagan) ఒక్కసారిగా ఢీలాపడిపోయారు. ఊహించని ఫలితాలతో ఒక్కసారిగా  ఖంగుతిన్నారు.  నేతలకు, శ్రేణులకు ధైర్యం  చెప్పి...మళ్లీ పోరాడితే విజయం మనదేనంటూ వారి స్ఫూర్తి రగిల్చాల్సిన అధినేత ఢీలాపడిపోతే...కిందిస్థాయి వాళ్ల పరిస్థితి  ఏంటి..? 


చంద్రబాబు, జగన్‌కు ఉన్న తేడా ఇదే..!


నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమేకాదు..దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతగా పేరుతెచ్చుకున్న చంద్రబాబు(Chandra Babu) సైతం 2019లో ఇదే రీతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ (TDP)చరిత్రలోనే అంత ఘోర పరాభవం ఎప్పుడూ చూడలేదు. కానీ వెంటనే తేరుకున్న ఆయన ఓటమిని మర్చిపోయి మళ్లీ కార్యక్షేత్రంలోకి దిగారు. జగన్ అధికారం చేపట్టిన నెల, రెండునెలల్లోనే మళ్లీ ప్రజా పోరాటాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఐదేళ్లపాటు జనంలో ఉన్నారు. అధికారంలో అండతో జగన్ వేధింపులను తట్టుకుని నిలబడ్డారు. ఎన్నో  అవమానాలను భరించారు. కుటుంబాన్ని అనరాని మాటలు అన్నా ఆయన కుంగిపోలేదు. చివరకు జైలుకు పంపినా  ఎక్కడా తన ముఖంలో నిర్వేదం ఛాయలు కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అదే ఈరోజు చరిత్రను మళ్లీ తిరగరాసేలా చేసింది. ఎక్కడైతే అవమానింపబడ్డాడ్డో...అక్కడే నేడు తలఎత్తుకుని నిలబడ్డాడు. దీనంతటికి కారణం....ఓటమి కుంగుబాటును దరిచేరనివ్వకపోవడం, ఐదేళ్లపాటు ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా  తెలుగుదేశం(Telugudesam) కేడర్‌ చెక్కుచెదరకుండా ఉందంటే....అందుకు అధినేత చంద్రబాబు అండ ఉందన్న ధైర్యమే. పట్టుమని 23 మంది ఎమ్మెల్యేలే  గెలిచినా....కేవలం ఐదుగురు మినహా మిగిలిన వారంతా పార్టీ వీడకుండా ఉన్నారంటే నిరంతరం వారిలో చంద్రబాబు (Chandrababu)రగిల్చిన స్ఫూర్తి కారణం. 



ఉండేవారే ఉంటారని జగన్ నిర్వేదం ! 


అధికారంలో ఉన్నప్పుడు  జగన్ ఏ తప్పులు అయితే చేశాడో...ఇప్పుడు అవే తప్పులు రిపీట్‌ చేస్తున్నారు తప్ప పద్ధతి మార్చుకోలేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.  ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు ఎలా ఉన్నా....జగన్‌(Jagan) సొంతపార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేలను అసలు కలవరని..కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వరన్నది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ. నియోజకవర్గ అభివృద్ధి పనులు గురించి అడగాలన్నా...పర్సనల్‌ పనులు చెప్పుకోవాలన్నా నెలల తరబడి వేచి చూసినా ఆయన దర్శనభాగ్యం దొరకలేదన్నది చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిన మాట. కనీసం పార్టీ వీడిపోతామని హెచ్చరించినా కూడా ఆయన నేరుగా కలిసి సర్దిచెప్పింది లేదు. ఇప్పుడు కూడా అంతే ఉండేవాళ్లు ఉంటారు....వెళ్లిపోయేవారిని ఆపేతే మాత్రం ఆగుతారా అంటూ అదే నిర్వేదం ప్రదర్శిస్తున్నారు. బలంగా ఉండేవాళ్లే తనతో ఉంటారని...నేను, మా అమ్మ కలిసి పార్టీని స్థాపించి ఇక్కడి వరకు వచ్చామని కావాలంటే మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దామంటూ  హితోపదేశం చేస్తున్నారు. శాసనమండలిలో  కూటమికి సంఖ్యాబలం లేనందును కొందరిని లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు జగన్‌కు వివరించగా...ఈ విధంగా బదులిచ్చారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టేంత సంఖ్యాబలం లేకపోవడంతో....కనీసం మండలిలోనైనా  బిల్లులు అడ్డుకుని తమ బలం చూపించుకోవాలని భావిస్తున్న వైసీపీకి...ఎమ్మెల్సీలు పార్టీ మారొచ్చన్న ప్రచారంతో ఖంగుతింది. అయితే వైసీపీ నుంచి కూటమికి వైపు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. చీరాల మున్సిపల్ ఛైర్మన్‌ సహా కౌన్సిలర్‌లు అంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.