YSRCP :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దర్నా ముగించుకుని గురువారం ఉదయమే అమరావతికి తిరిగి వచ్చేశారు. మాములుగా అయితే ఆయన గురువారం కూడా ఢిల్లీలోనే ఉండి ఏపీలో శాంతిభద్రతలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది. వారి అపాయింట్‌మెంట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో జగన్ వెనక్కి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆపాయింట్మెంట్ జగన్ తీవ్రంగా ప్రయత్నించారని చెబుతున్నారు. గతంలో ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల తన ఆవేన చెప్పుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. అయినా పీఎంవో నుంచి సమాధానం రాకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. 


జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీల మద్దతు                   


ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వచ్చాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం రాలేదు. పైగా ఏపీలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం కాదు.  ఎన్డీఏ ప్రభుత్వం. తమ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి ప్రధాని, హోంమంత్రి సమయం ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. రాష్ట్రపతి ముందస్తు అపాయింట్మెంట్లతో బిజీగా ఉన్నారని.. కొద్ది రోజుల తర్వతా సమయం దొరుకుతుందని తెలియడంతో ఇక జగన్ వెనక్కి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జగన్ ధర్నా ఏ ఉద్దేశంతో పెట్టుకున్నా ఆ లక్ష్యం నెరవేరిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 


అసెంబ్లీలో ఉన్న మూడోవంతు సభ్యులపై జగన్ అక్రమ కేసులు - లా అండ్ ఆర్డర్ పై చంద్రబాబు శ్వేతపత్రం


జాతీయ స్థాయిలో మద్దతు కోసం జగన్ చేసిన ప్రయత్నాలు సఫలం                                            


జాతీయ స్థాయిలో మద్దతు కోసం జగన్ చేసినప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఏపీలో శాంతి భద్రతల అంశాన్ని చాలా ప్రభావ వంతంగా దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లామని.. ఆ ఎఫెక్ట్ భవిష్యత్ రాజకీయాలపై ఉంటుందని చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమికి దగ్గరగా చేరే సూచనలు ఇచ్చారని.. తదుపరి పరిణామాలను తదుపరి రాజకీయాలపై ఆలోచన చేస్తారని అంటున్నారు. రాష్ట్రపతి, ప్రధానులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం వస్తే వదులుకోబోమని చెబుతున్నారు.             


షర్మిల నుంచి వైసీపీకి ముప్పు - కాంగ్రెస్ కూటమిపై వైపు జగన్ అడుగులు వ్యూహాత్మకమేనా ?


ఇక అసెంబ్లీకి హాజరవుతారా ?          


జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చినా.. అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం రోజూ శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. గురువారం లా అండ్ ఆర్డర్ పై వైట్ పేపర్ ప్రకటించారు. శుక్రవారం ఆర్థిక రంగంపై శ్వేతపత్రం ప్రకటించనున్నారు. ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.