Telangana Politics :  తెలంగాణ రాజకీయాలు డైనమిక్‌గా మారాయి. కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదేమో అనుకునే పరిస్థితి లేదు. ఏం ఏం జరిగినా ఏదో ఓ రాజకీయం  బయటపడుతూనే ఉంది. కానీ బీజేపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఈ కోణంలో చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చుట్టూ బీజేపీ గీత గీసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొన్నాళ్లుగా.. తెలంగాణ.. తెలంగాణతో  సంబంధం ఉన్నట్లుగా బయట జరుగుతున్న పరిణామాలు ఈ అంశాలను నిరూపిస్తున్నాయి. 


తెలంగాణలో వరుస ఐటీ దాడులు - రాజకీయాలకు సంబంధం లేదని అనుకోగలమా ?


తెలంగాణలో కొద్ది రోజులుగా బడా  రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.  మొన్న వాసవి గ్రూప్‌పై దాడులు చేయగా.. నిన్న ఫీనిక్స్ గ్రూప్‌ను టార్గెట్ చేశారు. వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల్ని హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహిస్తున్న ఈ సంస్థలు జాయింట్ వెంచర్లు కూడా వేశాయి. భూములు… అనుమతులు..ఇలా ప్రతీ దానికి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు లేకపోతే.. ఈ కంపెనీలు ఇలా వ్యాపార విస్తరణ చేసుకునేవి కావని ఎక్కువ మంది నమ్మకం.  వాసవి గ్రూప్‌లో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాలతోనే ఫీనిక్స గ్రూప్‌లో సోదాలు చేసినట్లుగా భావిస్తున్నారు. అక్కడ దొరికే లెక్కలు .. ఎవరిని ఇబ్బంది పెడతాయో చెప్పడం కష్టం. ఈ ఐటీ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదని.. అందరూ చెబుతారు. కానీ అలా సంబంధం లేదని రాజకీయ నేతలెవరూ నమ్మరు. పైగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలెవరూ నమ్మరం.  ముందు ముందు ఐటీ సోదాలు ఇంకా జరుగుతాయని.. గుట్టు అంతా బయటకు లాగే దాకా రాజకీయ లింకులు బయటకు రానివ్వరని అంటున్నారు. ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు సంచలనం. 


అసలేమీ లేకుండా కేసీఆర్ కుమార్తెను స్కాంలో ఇరికించే ధైర్యం చేస్తారా !?


కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తే..  కేసీఆర్‌ను లేదా.. ప్రభుత్వంలో నెంబర్ టూ గా  ఉన్నకేటీఆర్‌ను టార్గెట్ చేస్తాయనుకుంటారు. కానీ అనూహ్యంగా కవిత పేరు తెరపైకి వచ్చింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం ఫైల్స్ అన్నీ .. ఈడీ చేతికి వెళ్లీ వెళ్లక ముందు బీజేపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి.. అసలు ఢిల్లీ లో స్కాం ఎలా జరిగిందో వివరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కవితనే మాస్టర్ అని వారు చెబుతున్నారు.  అరుణ్ రామచంద్ర పిళ్లై.. బోయిన్‌పల్లి అభిషేక్ అనే వ్యక్తితోకలిసి రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నారు. ఈ అభిషేక్ .. కవితకు సమీప బంధువు. ఈ లిక్కర్ డీల్స్‌లో కీలకంగా పిళ్లైతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ఉన్నారు. వారందరి పేర్లను ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మీడియా ముందు పెట్టారు.  పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల నిర్వహణ ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందంటే.. ఈ లిక్కర్ సిండికేట్లే ఇచ్చాయని అంటున్నారు. అక్కడే తీగ లాగితే తెలంగాణలో తేలిందని చెబుతున్నారు. ఏ విధంగా చూసినా లిక్కర్ స్కాంలో కవిత నిండా మునిగిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఏ ఆధారం లేకుండా.. కవితను ఇరికించే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. 


బీజేపీ వ్యూహాలను కేసీఆర్ అర్థం చేసుకోలేకపోయారా ?


బీజేపీతో ఉన్న మంచి సంబంధాలను కేసీఆర్ ఎప్పుడైతే కాదనుకున్నారో అప్పట్నుంచి రాజకీయం మారిపోతుందని అందరూ ఊహించారు. కేసీఆర్ కూడా ఊహించారు. అయితే.. ఆయన మోదీని ఢీకొట్టగలనని అనుకున్నారు. తనపై ఈడీ దాడులు జరిగినా.. ఎదుర్కోగల శక్తి ఉందని అనుకున్నారు. అందుకే చాలా బహిరంగసభల్లో సవాళ్లు చేశారు కూడా. కానీ సీబీఐ, ఐటీ, ఈడీ ఇప్పుడు నేరుగా ఆయన మీదకు రావడం లేదు.  సీబీఐ కవితను గురిపెట్టినట్లుగా కనిపిస్తూండగా.. మరో కీలక వ్యక్తిని ఐటీ గురి పెట్టిందని ఇన్‌కంట్యాక్ దాడులు నిరూపిస్తున్నాయి. ఈ రెండు సంస్థల సోదాల్లో ఏం దొరికినా ఈడీ చేతికి చిక్కినట్లే. అంటే కేసీఆర్‌ను కాకుండా బీజేపీ..ఆయన ఆయువు పట్టును టార్గెట్ చేసిందనేది సులువుగా అంచనా  వేయగలిగే విషయం. 


కేసీఆర్ వాట్ నెక్ట్స్ ?


బీజేపీతో యుద్ధాన్ని కేసీఆర్ ప్రారంభించేశారు. ఇప్పుడు మధ్యలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అలా తగ్గితే..  బీజేపీ నిండా మింగేస్తుంది. చివరి వరకూ పోరాడాలి. కానీ ఈ విషయంలో బీజేపీ బలాలు వేరు.. కేసీఆర్ బలాలు వేరు. బీజేపీకి త్రివిధ దళాలుగా చెప్పుకునే సీబీఐ, ఐటీ, ఈడీ ఉంటాయి. కానీ కేసీఆర్‌కు అలాంటి చాన్స్ లేదు. అందుకే కేసీఆర్ బీజేపీని ఎదుర్కోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని మించిన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే బీజేపీదే పైచేయి అవుతుంది. అది టీఆర్ఎస్ భవిష్యత్‌కు కూడా ప్రమాదకరం.