Pawan On Fire :  వైఎస్ఆర్‌సీపీ మంత్రులు వర్సెస్ జనసేన అన్నట్లుగా గత రెండు, మూడు రోజులుగా రాజకీయం నడుస్తోంది. విశాఖలో గర్జన పెట్టాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించడంతో ఎందుకీ గర్జన అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా పాతిక ప్రశ్నలు సంధించాంచారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యక్తిగత విషయాలు కానీ.. ప్రజలతో సంబంధం లేని అంశం కానీ లేదు. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు.. ఏపీ ప్రభుత్వ విధానాలు,  పాలనా వైఫల్యాల్ని ప్రశ్నించే విధంగానే ఉన్నాయి. అయితే ఈ ట్వీట్లపై వైఎస్ఆర్‌సీపీలో కీలక మంత్రులు స్పందించారు. అయితే ఎవరూ పవన్ కల్యాణ్  చేసిన ట్వీట్లు అబద్దమని కానీ..  తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని కానీ చెప్పలేదు. అసలు ట్వీట్లలో పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలపై స్పందించలేదు. కానీ ఘాటుగా కౌంటర్లు మాత్రం ఇచ్చారు. 

Continues below advertisement


పవన్ రాజకీయ విమర్శలకు వ్యక్తిగత విమర్శలే వైఎస్ఆర్‌సీపీ నేతల కౌంటర్ !


పవన్ కల్యాణ్‌ వైఎస్ఆర్‌సీపీపై ఎప్పుడు విమర్శలు చేసినా మంత్రులు.. ముఖ్యంగా పవన్ సామాజికవర్గానికి చెందిన మంత్రులు టార్గెటెడ్‌గా మీడియా ముందుకు వస్తారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని ఆరోపిస్తారు. మరికొంత మంది ముందుకు వెళ్లి పవన్ కల్యాణ్ వ్యక్తిగత రాజకీయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.  అసలు రాజకీయాలతో సంబంధం లేని అంశాలతో దూషణలకు దిగుతూంటారు. మంత్రి గుడివాడ అమర్నాత్ ఈ విషయంలో మరింత దారుణమైన ట్వీట్లు పెడుతూంటారు. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా కించపరిచేందుకు అధికార పార్టీ నాయకులు ఏ మాత్రం వెనుకాడరు. పవన్ చేసిన విధానపరమైన విమర్శలకు కౌంటర్ అంటే... పవన్ కు చంద్రబాబుతో లింక్ పెట్టడం.. వ్యక్తిగతంగా కించపర్చడమే అనుకుంటున్నారు. 


ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే చంద్రబాబుకు సపోర్ట్ చేయడం అని వైఎస్ఆర్‌సీపీ వాదన !


అయితే పవన్ కల్యాణ్‌కు ఓ పార్టీ ఉంది. ఆయన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసేదే అది. అలా చేసినంత మాత్రాన ఆయన చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని విమర్శలు చేయడం ఏమిటో జనసైనికులకూ అర్థం కాదు. కానీ అలా అయినా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే విమర్శలు ఆపేస్తారని వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యూహం కావొచ్చు కానీ..  అంత మాత్రం దానికే విమర్శలు తగ్గించేంత బలహీన మనస్థత్వం పవన్ కల్యాణ్‌ది కాదని జనసైనికులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కంగారుకు మరో కారణం కూడా ఉంది. పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన తేదీలు ప్రకటించగానే వైఎస్ఆర్‌సీపీ నేతలు కంగారుపడిపోయారు. 


గర్జన రోజు పవన్ విశాఖ వస్తున్నా కంగారు పడుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు!


మూడు  రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన అంటూ వైసీపీ నేతలు చేస్తున్న కార్యక్రమం రోజునే పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తున్నారు. తర్వాతి రోజు జనవాణి కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకున్న గుడివాడ అమర్నాథ్‌కు .. పెద్ద చిక్కొచ్చి పడింది. త పవన్ కల్యాణ్ పర్యటన కోసం జనసైనికులు.. భారీగా తరలి వచ్చి.. గర్జనకు పెద్దగా జనం రాకపోతే సమస్య అవుతంది. అందుకే  పవన్ కల్యాణ్ విశాఖ రావొద్దని ఆయన అంటున్నారు. ఆయన విశాఖ వస్త  ప్రజలు నిలదీస్తారని అంటున్నారు. తన గర్జన కార్యక్రమం నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన విశాఖ వస్తున్నారని  అంటున్నారు.  ఇప్పటికే పవన్ కల్యాణ్..  మూడు రాజధానుల విషయంలో తన వ్యతిరేకతను  బలంగా వినిపించారు. ఒక్క రాజధాని అమరావతికే మద్దతు ప్రకటించారు. అందుకే పవన్‌ను కంట్రోల్ చేసేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు తంటాలు పడుతున్నారు. 


పవన్ కల్యాణ్ అనే లీడర్ వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడు అత్యంత కీలకం. ఆయన గెలుపు, ఓటమికి మధ్య గీతలా ఉన్నరన్న భావన వైఎస్ఆర్‌సీపీలో ఉంది. అందుకే ఆయన ప్రభావాన్ని తగ్ిగంచడానికే ఇలా చేస్తున్నారన్న వాదనలు జనసైనికుల్లో ఉన్నాయి. దాన్ని పవన్ సమర్థంగా ఎదుర్కొంటారని అంటున్నారు.